అర్ధిక అభివృద్ధి పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు తన మనుషులకే మేలు చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. మహమ్మారి కరోనా సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారని, చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరుగారి పోయాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యాన్ని ఏం చేయదలచుకున్నారు అని ప్రశ్నించారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, జనాలను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు అని విడదల రజని నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడారు.
‘చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు రోడ్డెక్కారు, పరిశ్రమల ఊసే లేదు. అర్ధిక అభివృద్ధి పేరుతో బాబు తన మనుషులకే మేలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది ఆయనకు ఇష్టం లేదు. కరోనా సమయంలో వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారు. కానీ చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇప్పుడు ఏదడిగినా పీపీపీ పద్దతి అంటున్నారు. మెడికల్ కాలేజీల ద్వారా ఆరోగ్య సేవలను జగన్ గారు విస్తృత పరిచారు. రాష్ట్ర ప్రజలకు మంచి వైద్యం అందించాలని ఆయన భావించారు. 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. వైద్య విద్య చదివే వారి ఆశలను నిజం చేయాలని జగన్ చూశారు. కార్పొరేట్ స్థాయిలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని జగన్ భావించారు. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించటానికి అడుగులేశారు. అలాంటి మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు ప్రయివేటీకరణ చేస్తున్నారు. ఒక సంస్థతో సర్వే చేయించినట్టుగా కథ నడిపి వారితో రిపోర్టును తెప్పించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వారికి అనుగుణంగా రిపోర్టు ఇచ్చారు. ఒక్కో కాలేజీని సంవత్సరానికి 5 వేల చొప్పున లీజుకు ఇస్తున్నారు. 5 వందల కోట్ల విలువైన ఆస్తిని 5 వేలకు ఇవ్వటం ఏంటి?’ అని మాజీ మంత్రి విడదల రజని ప్రశ్నించారు.
Also Read: CM Chandrababu: నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు!
‘పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని చంద్రబాబు నాయుడు ఏం చేయదలచుకున్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బాబు ప్రజలను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నుండి చంద్రబాబు ప్రభుత్వం తప్పుకోవడం సరికాదు. మేము అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రివ్యూ చేస్తాం. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కోసం వైఎస్ జగన్ అనేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వాటిని కూడా ఈ ప్రభుత్వం నాశనం చేసింది. గిరిజనులకు మరలా డోలీల బాధ తప్పటం లేదు’ అని విడదల రజని ఆవేదన వ్యక్తం చేశారు.