Harish Shankar: ఉగాది పర్వదినం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న హరీశ్ శంకర్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి మురిసిపోయారు..
ట్రైలర్ చూసిన తర్వాత చిరంజీవి తనకు ఫోన్ చేసి సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడారని హరీశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చిరంజీవి గారు ట్రైలర్లోని ప్రతి షాట్ను మెచ్చుకున్నారు. పవన్ చాలా అందంగా ఉన్నారని ఆయన మురిసిపోతుంటే.. చిరంజీవికి పవన్ కేవలం తమ్ముడు మాత్రమే కాదు, ఒక కొడుకు కూడా అని నాకు అనిపించింది” అని హరీశ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, భవిష్యత్తులో చిరంజీవితో కలిసి ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’ వంటి మాస్ హిట్లను మించే సినిమా తీస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చాకే దేశం గురించి మాట్లాడుతున్నారని అనుకోవడం పొరపాటని, ‘ఖుషి’, ‘బద్రి’, ‘బాలు’ వంటి సినిమాల్లోని పాటల ద్వారా ఆయన ఎప్పుడో తన సామాజిక స్పృహను చాటుకున్నారని గుర్తు చేశారు. “శ్రీశ్రీ గారి పద్యానికి ప్యాంట్, షర్ట్ వేసి.. దానికి కాస్త ‘స్వాగ్’ అద్దితే ఆ రూపమే పవన్ కళ్యాణ్” అంటూ తనదైన శైలిలో అభివర్ణించారు. పవన్ సహజ నటన వెనుక ఎంతో కష్టం ఉంటుందని, చిన్న డైలాగ్ కోసం కూడా ఆయన పదే పదే రిహార్సల్స్ చేస్తారని అన్నారు. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా పవన్ అభిమానుల్లో కొత్త జోష్ నింపుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.
READ ALSO: Iran-Israel: ఇరాన్ సైన్యాధిపతి సోలేమానీ హతం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన