TTD: ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారి ఆలయంలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.. సెప్టంబర్ 18వ తేదీ నుంచి 26వ తేవీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. ఇక, అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు ఈవో ధర్మారెడ్డి.
Read Also: Rajasthan: ఓ విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం పోసిన విద్యార్థి.. ఆగ్రహించిన గ్రామస్తులు
ఇక, సాలకట్ల బ్రహ్మోత్సవాలు సందర్భంగా సెప్టెంబర్ 18వ తేదీన రాష్ర్ట ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. సెప్టెంబర్ 22న గరుడ సేవ, 23న స్వర్ణరథ ఉరేగింపు ఉంటాయని.. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖల స్వీకరణపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాలకు చెందిన 10 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తాం.. గరుడ సేవ రోజున తిరుమల చేరుకున్న భక్తులందరికీ స్వామివారి దర్శనభాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. కొన్ని రోజుల క్రితం వరకూ శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూసేవారు. కానీ, ఇప్పుడు ఎక్కడా భక్తులు వేచి ఉండకుండా నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు.