NTV Telugu Site icon

Tirumala: రేపు తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం

Tirumala

Tirumala

TTD: రేపు ( సోమవారం) తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఘనంగా జరుగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తుంబురు తీర్థానికి ఇవాళ ఉదయం 5 నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు, మ‌ళ్లీ రేపు ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతిస్తారు. అలాగే పాప‌వినాశ‌నం డ్యామ్ దగ్గర భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందించనున్నారు. ఇక, ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.

Read Also: Gold Price Today : గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఎంతంటే?

కాగా, తుంబురు తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది. కాబట్టి.. గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి పర్మిషన్ లేదని టీటీడీ తెలిపింది. పలువురు భక్తులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అధికారులు తెలిపారు. అలాగే భ‌క్తులు వంట సామగ్రి, క‌ర్పూరం, అగ్గి పెట్టెలు తీసుకురావొద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది. ఇక, పోలీసుశాఖ, అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుంచి తుంబురు తీర్థం వరకు భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. అలాగే, ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. రేపు తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

అయితే, ప్రకృతి సౌందర్యాల మధ్య నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తుంటారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక, జూన్ నెలకు సంబంధించి శ్రీవారి సేవ యొక్క ఆన్‌లైన్ కోటా టికెట్లను ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు అలాగే, పరకామణి సేవ తిరుమల కోసం మధ్యాహ్నం 1 గంటకు టికెట్లను టీటీడీ రిలీజ్ చేయనుంది. రేపు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడసేవ కొనసాగనుంది. ప్రతి నెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.