TGSRTC : తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించి, సమ్మె నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సంస్థ అభివృద్ధి మార్గంలో పయనిస్తున్న సమయంలో సమ్మె అనేది తీరని నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. యాజమాన్యం వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంస్థ పూర్తిగా కట్టుబడి ఉంది. 2019లో జరిగిన సమ్మె సంస్థను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయగా, ఇప్పుడు ఉద్యోగుల సమిష్టి కృషితో ఆ కష్టాలను అధిగమించి ప్రజల్లో విశ్వాసం పొందుతోందని పేర్కొంది.
Land Allocation in Amaravati: అమరావతిలో ఏ సంస్థకు ఎంత భూమి..? తేల్చనున్న కేబినెట్ సబ్కమిటీ
ఈ నేపథ్యంలో మరోసారి సమ్మెకు ప్రయత్నించడం సంస్థ భవిష్యత్తో పాటు ఉద్యోగుల భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని లేఖలో హితవు పలికింది. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం సమ్మెలాంటి నిర్ణయాలను ప్రోత్సహించుతున్నారని, వారి మాటల ప్రభావంతో ఊగిపోవద్దని హెచ్చరించింది. ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటోందని స్పష్టం చేసింది. సంస్థకు వచ్చే ప్రతి రూపాయిని ఉద్యోగుల రాయితీలు, వేతనాలు, భద్రత కోసం వినియోగిస్తున్నట్లు వివరించింది.
అదే సమయంలో, ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధితమై ఉన్నాయని, సంస్థ నిబంధనల ప్రకారంగా సమ్మెలు చట్టవ్యతిరేకమని స్పష్టం చేసింది. సమ్మె పేరుతో ఇతర ఉద్యోగులను బెదిరించడం, విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలు చట్టపరమైన ఫలితాలు తేవచ్చని హెచ్చరించింది.