Uppal Bhagayat: హైదరాబాద్ నగర శివారులోని ఉప్పల్ భాగాయత్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవన స్థలంలో పిల్లర్ కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. మృతిచెందిన బాలురు అర్జున్ (8) కాగా, మరొకరు మణికంఠ (15)గా అదిరికారులు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కుటుంబంతో పాటు వలస వచ్చిన ఈ చిన్నారులు, ఉప్పల్ లోని కుర్మానగర్ ప్రాంతంలో తాత్కాలిక నివాసం ఉంటున్నారు. వారి తల్లిదండ్రులు అక్కడే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా జీవనోపాధి కోసం పనిచేస్తున్నారు. కాగా, ఈ ఇద్దరు చిన్నారులు నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోగా.. కుటుంబసభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
Read Also: Nubia Z70S Ultra: 50MP+50MP కెమెరాలు, 6600mAh బ్యాటరీతో నుబియా Z70S అల్ట్రా గ్లోబల్ లాంచ్..!
రాత్రి నుండి పోలీసులు గాలింపు చేపట్టగా.. ఇవాళ ఉదయం భాగాయత్లో కుల సంఘాల భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో తవ్విన పిల్లర్ గుంతలో అర్జున్ మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత చాలాసేపు అనంతరం మరొక బాలుడు మణికంఠ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చిన్నారులు ఆ గుంత వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడ్డారా? లేక మరేదైనా అనుమానాస్పద అంశముందా? అనే దానిపై స్పష్టత కోసం విచారణ కొనసాగుతోంది. సంఘటన స్థలానికి హైడ్రా అధికారులు, డిఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక దళం చేరుకుని గల్లంతైన మణికంఠ కోసం వెతికే చర్యలు కొనసాగిస్తున్నారు.