మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో చనిపోయిన రైతు కుటుంబాలను, చనిపోయిన ఆర్మీ జవాన్ల కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల వారికి ఇచ్చే ప్రాధాన్యత తెలంగాణ వారికి ఇవ్వరా అని ఆయన మండిపడ్డారు. ఇతర రాష్ర్టాలలో పార్టీ విస్తరణ కోసం తెలంగాణ ప్రజల సొమ్మును ఢిల్లీ, పంజాబ్, బీహార్ రాష్ర్టాలకు పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ మోడల్ అంటే కమీషన్లు..కాంటాక్ట్లు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుజరాత్ మోడల్ అంటే మత విద్వేషాలు, ఆస్తులు విధ్వంసం చేయడమేనని ఆరోపించారు. ఇలాంటి మోడల్ తెలంగాణలో తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, సందట్లో సడేమియాలా గులాంనబీ ఆజాద్ మోడీకి గులాంగా మారారంటూ ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని.. గులాంనబీ అజాద్ కాంగ్రెస్ను నిందిస్తున్నారని, రాజ్యసభ రెన్యూవల్ కాలేదని.. పార్టీ వీడారంటూ ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్లో జరిగిన నరమేథం ఆజాద్ మర్చిపోయారా.. అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ చేతిలో ఆజాద్ కీలుబోమ్మలాగ మారారంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు.