ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు:
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను అధికారులు ఓపెన్ చేశారు. ముందుగా బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనున్నారు. ఈ ప్రక్రియ దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని.. అసలు కౌంటింగ్ ప్రక్రియ ఆ తర్వాత మొదలు కానుందని అధికారులు చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. అయితే పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి మాత్రం 2, 3 రోజుల సమయం పట్టే అవకాశముంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణలో ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి.. తెలంగాణలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ 6 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు లెక్కింపు జరుగుతోంది. చెల్లుబాటు అయిన ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.
బీఆర్ఎస్ నేతకు కేసీఆర్ సాయం:
బీఆర్ఎస్ నేత డోకుపర్తి సుబ్బారావుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. అనారోగ్యంగో బాధపడుతున్న సుబ్బారావును ఎర్రవల్లిలోని తన నివాసానికి కేసీఆర్ ఆహ్వానించారు. దీంతో సుబ్బారావు దంపతులు.. కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా సుబ్బారావు యోగ క్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అనంతరం రూ.10 లక్షల చెక్ను సుబ్బారావు దంపతులకు కేసీఆర్ అందజేశారు. కేసీఆర్ సాయంపై సుబ్బారావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్కు దంపతులిద్దరూ కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం టౌన్లో సుబ్బారావు.. పార్టీ కోసం విశేష కృషి చేశారు. పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించేవాడు. సోషల్ మీడియా ద్వారా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వాడు. ఇక ఖమ్మం జైల్లో కేసీఆర్ A1 గా ఉన్నప్పుడు, సుబ్బారావు.. A2గా ఉన్నాడు. అయితే ఇటీవల సుబ్బారావు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్.. ఎర్రవల్లిలోని తన నివాసానికి రావాలని ఆహ్వానించారు. సుబ్బారావు.. తన భార్యతో కలిసి కేసీఆర్ను కలిశారు. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల చెక్ను అందజేశారు.
నేటి నుంచి 5 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ:
తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ నెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఈనెల 20వ తేదీన పోలింగ్జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉంది.
సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా నేడు సోమనాథ్ ఆలయాన్ని మోడీ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, శివుడికి జలాభిషేకం నిర్వహించారు. ప్రధాని మోడీ మూడు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ వచ్చారు. తన పర్యటనలో రెండవ రోజు సోమనాథ్ ఆలయానికి చేరుకుని, అక్కడ ప్రార్థనలు చేసి, ఆ తర్వాత జునాగఢ్లోని ససంగీర్కు బయలుదేరారు. ప్రధానమంత్రి ఈ రాత్రి జునాగఢ్లోని సింగ్ సదన్లో విశ్రాంతి తీసుకుంటారు. సోమవారం ఉదయం గిర్ నేషనల్ పార్క్లో సఫారీకి వెళ్తారు.
మరోసారి ట్రంప్తో భేటీపై జెలెన్స్కీ కీలక ప్రకటన:
వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం నడిచింది. రష్యాతో యుద్ధం, అలాగే ఖనిజ ఒప్పందాలపై ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది. మధ్యలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలుగజేసుకున్నా.. జెలెన్స్కీ ఏ మత్రం వెనుకడుగు వేయలేదు. మీడియా సమక్షంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు దూకుడుగా వ్యవహరించారు. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఎలాంటి సంతకాలు చేయకుండానే సమావేశం మధ్యలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెళ్లిపోయారు. తాజాగా జెలెన్ స్కీ స్పందిస్తూ.. మరోసారి ట్రంప్తో భేటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అమెరికాతో సంబంధాలు కొనసాగించాలని అనుకుంటున్నానని.. దాన్ని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు అని చెప్పారు. నిర్మాణాత్మక సంభాషణ కోసం డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తేందుకు రెడీగా ఉన్నట్లు జెలెన్ స్కీ స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు జెలెన్ స్కీ వెల్లడించారు.
రోడ్డుపై గుంతలు:
రోడ్లపై గుంతలు వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. గుంతల్లో పడి కొందరు గాయాలపాలై, మరికొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు మన దేశంలో కోకొల్లలు. రోడ్ల నిర్మాణం చేపట్టాలంటూ తమకు తోచిన పద్దతుల్లో నిరసనలు వ్యక్తం చేస్తుంటారు. ఇదే రీతిలో ఓ యువకుడు రోడ్లపై గుంతలతో విసుగెత్తిపోయి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రోడ్డుపై పేరుకుపోయిన నీటిలో మనిషిని పోలిన నకిలీ బొమ్మను తలకిందులుగా ఉంచి రోడ్డు దుస్థితిని ఎత్తి చూపాడు. ఈ ఘటన లండన్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. జేమ్స్ అనే యువకుడు మాట్లాడుతూ రోడ్డుపై ఉన్న గొయ్యి ఎనిమిది నెలలుగా అక్కడే ఉందని చెప్పాడు. వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందని వెల్లడించాడు. అధికారులు పట్టించుకోకపోవడంతోనే తాను ఇలా చేశానని తెలిపాడు. ఈ విషయం అధికారుల వద్దకు చేరింది. కేంబ్రిడ్జ్షైర్ కౌంటీ కౌన్సిల్ హైవే అధికారులలో ఒకరు రోడ్డును తనిఖీ చేసి, అవసరమైతే మరమ్మతులు చేపడతామని స్పష్టం చేశారు.
ప్రభాస్ – ప్రశాంత్ వర్మ:
బాహుబలి తర్వాత ప్రభాస్ లైనప్ చూస్తే ఎప్పుడు ఎవరితో ఎలాంటి సినిమా చేస్తాడనేది అస్సలు ఊహించలేం. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ఒక్కో డిఫరెంట్ జానర్లో సినిమాలు చేస్తు వెళ్ళాడు డార్లింగ్. జయాపజయాలు పక్కన పెడితే ఈ సినిమాల దర్శకులంతా ఒకటి రెండు సినిమాలు చేసిన వారే. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపూడితో ‘ఫౌజీ’ చేస్తుండగా స్పిరిట్, సలార్ 2, కల్కి 2 లైన్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు మరొక యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో సినిమాకు ఒకే చెప్పాడు ప్రభాస్. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్తో పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ చేస్తున్నాడు. అయితే ఇదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను కలిసి కథ వినిపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు ప్రభాస్. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారంకంగా ప్రకటన రానుంది. ఈ లోగా మిగిలిన పనులు ఫినిష్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇటీవల ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా చేసేసారట. అలాగే ఈ సినిమా అనౌన్సమెంట్ వీడియో రెడీ చేసేందుకు హనుమాన్ స్టూడియోలో 3 డేస్ షూట్ చేశారు. అందులో 2 డేస్ ప్రభాస్ పై షూట్ చేశారు. పోస్టర్ కి కావాల్సిన ఫోటో షూట్, వీడియో షూట్ కూడా చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి ఉగాది కానుకగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో మరొక హీరో:
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు తిరుగులేని విజయాన్ని అందించింది. అంతేకాదు హిందీలో బన్నీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉండగా మధ్యలో తమిళ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. జవాన్ సూపర్ హిట్ తర్వాత మరో సినిమా చేయని అట్లీ, ఐకాన్ స్టార్ కోసం కథ రెడీ చేసాడట. ఇటీవల అల్లు అర్జున్ ను కలిసిన అట్లీ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బన్నీ. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారని, బన్నీ తో పాటు మరో తమిళ హీరో కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది. షూటింగ్ టైమ్లైన్లు మరియు ఇతర లాజిస్టికల్ అంశాలపై అట్లీ టీమ్ కసరత్తులు చేస్తోంది. ఏప్రిల్ లేదా మే నాటికి ప్రీ-ప్రొడక్షన్ని ప్రారంభించాలని చూస్తున్నాడుట అట్లీ. ఈ సినిమాను తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తారని చెన్నై సినీవర్గాల టాక్. అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే తమిళ లేటెస్ట్ సెన్సేషన్ అభయంకర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. అట్లీ, అల్లు అర్జున్ కాంబో మాస్ ఫీస్ట్ గా ఉండబోతుందని ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుందని ఇన్ సైడ్ టాక్.
పంజా విసిరిన వరుణ్ చక్రవర్తి:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ కివీస్ పై ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో న్యూజీలాండ్ ను చిత్తు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. బౌలర్ల్ ధాటికి కివీస్ ప్లేయర్స్ పెవిలియన్ కు క్యూ కట్టారు. కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులు మాత్రమేచేసి ఆలౌట్ అయ్యింది. కాగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరఫున శ్రేయాస్ అయ్యర్ అత్యధికంగా 79 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్య (45) పరుగులతో రాణించారు.