11వేల కోట్ల స్కాం జరిగింది:
కూటమి ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలం నుండి సంక్షేమ పథకాలు అమలు చెయ్యకుండా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద బురద జల్లి కాలం గడిపేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలులో దాదాపు 11వేల కోట్ల స్కాం జరిగిందని, ప్రభుత్వ ఖజానాపై ఎంతో భారం పడుతుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. అధికారంలోకి వచ్చాక అధిక రేట్లు పెంచేస్తున్నారని గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన కమిషన్:
విశాఖలోని సింహాచలం ఆలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి గత నెల 30న ఏడుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులతో ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం విచారణ తర్వాత కమిటీ ప్రభుత్వానికి ఈరోజు నివేదిక అంధించింది. కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామ నారాయణ రెడ్డిలతో సీఎం చంద్రబాబు చర్చించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని మంత్రులను సీఎం ఆదేశించారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. తాత్కాలికంగా కట్టిన గోడకు పునాది లేదని.. భారీ వర్షం వల్ల పెద్ద ఎత్తున నీరు, బురద చేరి గోడ కూలిందని కమిషన్ తమ నివేదకలో పేర్కొంది. గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవని, చందనోత్సవానికి వారం ముందు హడావిడిగా గోడ నిర్మించారని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది:
కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్లో జరిగిన సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం, బాగున్నారా..? అంటూ తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టిన ఆయన అనేక అభివృద్ధి అంశాలపై స్పందించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు సరిగా సాగడంలేదని గడ్కరీ పేర్కొన్నారు. ఈ పనుల్లో తలెత్తిన సమస్యకు పరిష్కారం కనుగొన్నామని, వేగంగా పూర్తి చేయడంకోసం కొత్త కాంట్రాక్టర్ను నియమించామని తెలిపారు. వచ్చే పది నెలల్లో ఫ్లై ఓవర్ను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ భూసేకరణ వేగంగా పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉత్తర తెలంగాణలో భూకంపం:
తెలంగాణలో పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2 నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో భూమి కంపించినట్లు సమాచారం అందుతోంది. ఈ భూ ప్రకంపనలు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల సుల్తానాబాద్ లో వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, జన్నారంలో కూడా భూమి కనిపించినట్లు తెలుస్తోంది. భూమి ఒక్కసారిగా ప్రకంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటికి పరుగులు తీశారు. అయితే ఆస్థి, ప్రాణ నష్టం లాంటి సంఘటనలు జరగలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎం వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల నేతల రియాక్షన్:
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సబ్ కమిటీ ఏర్పాటైనప్పటికీ, ఏడు నెలలు గడిచినా ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘం (TNGO) అధ్యక్షుడు జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి., సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలని పిలిచారు.. కానీ మంత్రులు మాత్రం చర్చకు సమయం కేటాయించడం లేదని అన్నారు. గత ప్రభుత్వం విజ్ఞప్తులకు స్పందించకపోవడం వాస్తవమే. ఆర్థిక సమస్యలు పక్కన పెట్టినప్పటికీ, విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. మేము సమరం కాదు, ఉద్యమం చేస్తున్నాం. మంత్రుల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నాం. అడగొద్దు అంటే అడగం. మేమే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చాం అని ఆయన పేర్కొన్నారు.
అక్కడ రోబోలే డాక్టర్లు:
ప్రతి రంగంలో దూసుకెళ్తున్న చైనా తాజాగా వైద్య రంగంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (AI) టౌన్ ను ఏర్పాటు చేసింది. ఇది పూర్తిగా వర్చువల్ ప్రపంచంలో పని చేస్తుంది. ఈ టౌన్లో రోగులను AI డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. అంటే ఇక్కడ డాక్టర్లు మనుషులు కాదు. పూర్తిగా రోబోలే డాక్టర్లుగా సేవలు అందిస్తాయి. మరి ఈ వింత విషయానికి సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా. చైనాలోని ప్రముఖ విద్యా సంస్థలలో ఒకటైన ట్సింగ్హువా యూనివర్సిటీ వైద్య రంగంలో విప్లవాత్మక అడుగు వేసింది. 2025 ట్సింగ్హువా మెడిసిన్ టౌన్హాల్ సమావేశంలో ఈ సంస్థ కృత్రిమ మేధస్సు ఆధారిత ‘AI ఏజెంట్ హాస్పిటల్’ ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇది వైద్య సేవలలో AI సమగ్ర భాగస్వామిగా మారే దిశగా కీలకంగా మారింది. ఈ AI హాస్పిటల్ను అనుబంధ రంగాలైన ఇంజినీరింగ్, మెడిసిన్ లో ట్సింగ్హువా యూనివర్సిటీ కలిగిన అనుభవాన్ని వినియోగించి దశలవారీగా అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. ఇక తొలి దశలో బీజింగ్ ట్సింగ్హువా చంగుగ్ హాస్పిటల్, దానికి అనుబంధంగా ఉన్న ఇంటర్నెట్ హాస్పిటల్లో పైలట్ ప్రోగ్రామ్లు ప్రారంభం కానున్నాయి. వీటిలో జనరల్ ప్రాక్టీస్, రేడియాలజికల్ డయాగ్నొస్టిక్స్, శ్వాస సంబంధిత విభాగాలతోపాటు మరికొన్ని ఉండనున్నట్లు తెలిపారు.
రక్షణ వెబ్సైట్ పై పాక్ సైబర్ దాడి:
దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది. ఈ దాడిలో 26 మంది, ప్రధానంగా పర్యాటకులు, తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన భౌతిక సరిహద్దుల్లోనే కాక, డిజిటల్ రంగంలో కూడా ఉద్రిక్తతలను రగిల్చింది. పాకిస్థాన్ హ్యాకర్లు భారత రక్షణ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు పాల్పడుతూ, దేశ రక్షణ వ్యవ్యస్థకి సవాలు చేస్తున్నారు. అయితే, భారత సైబర్ రక్షణ ఏజెన్సీలు ఈ దాడులను దీటుగా ఎదుర్కొంటూ, దేశ భద్రతను కాపాడుతున్నాయి.
నానికి కలిసొస్తున్న మాస్ రూట్:
నేచురల్ స్టార్ నాని అంటే ఓ బ్రాండ్ ఉండేది. ఆయన క్లాస్ హీరో. యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్స్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్, కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు. ఆయన సినిమాలు అందరూ చూసే విధంగా ఉండేవి. నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే బ్రాండ్ ఉండేది. అలాంటి నాని రూటు మార్చేశాడు. ఏ హీరో అయినా లాంగరన్ లో స్టార్ డమ్ పెంచుకోవాలంటే కచ్చితంగా మాస్ ఫాలోయింగ్ ఉండాల్సిందే. మాస్ హీరో అనే ముద్ర పడాల్సిందే. ఆ విషయం నానికి కూడా తెలుసు. అందుకే క్లాస్ నుంచి మాస్ రూట్ కు టర్న్ అయిపోయాడు. దసరా సినిమా నుంచే మాస్ లోకి వచ్చేశాడు. మొదటి ప్రయత్నం సక్సెస్ అయింది. దసరా పెద్ద హిట్ అయి నాని రూట్ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వత మధ్యలో కొన్ని క్లాస్ సినిమాలు చేశాడు. కానీ అవి నానికి అంతగా కలిసిరాలేదు. దీంతో మళ్లీ మసా రూట్ కు ఎక్కేశాడు. సరిపోదా శనివారంతో మళ్లీ మాస్ హిట్ అందుకున్నాడు. తాజాగా హిట్-3తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీని తర్వాత కూడా భారీ మాస్ సినిమానే చేస్తున్నాడు. అదే ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాతో మళ్లీ మాస్ యాంగిల్ లోనే వస్తున్నాడు నాని. ఇలా వరుసగా మాస్ రూట్ లో సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ అందుకుంటున్నాడు.
ఈసారి మరింత భయపెట్టేలా మంగళవారం 2:
ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్లో బ్లాక్బస్టర్ ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతికి ఆ తర్వాత చేసిన మహాసముద్రం అనే సినిమా పెద్దగా కలిసి రాలేదు. అయితే ఏ మాత్రం నిరాశ చెందకుండా, పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో చేసిన మంగళవారం సినిమా ఆయనకు మరో హిట్ అందించింది. అయితే ఇప్పుడు ఆయన మంగళవారం సినిమాకి సీక్వెల్గా మంగళవారం 2 సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే, మంగళవారం సినిమాలో ఒక మహిళ మానసిక రుగ్మత ఆధారంగా సినిమా కథ రాసుకున్నాడు, దానికి కాస్త హారర్ టచ్ ఇచ్చాడు. కానీ ఈ సెకండ్ పార్ట్ విషయంలో మాత్రం రూరల్ డివోషనల్ టచ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి మనం పల్లెటూర్లకు వెళితే, గ్రామదేవతలు, ఊరి దేవతల ప్రస్తావన వింటూనే ఉంటాం. అలాంటి ఒక గ్రామ దేవత కథ ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు కథ రాయడం పూర్తయిందని, ఒక స్టార్ హీరోయిన్ని అప్ప్రోచ్ అయ్యారని, ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని అంటున్నారు. ఈ సినిమాని అజయ్ భూపతితో కలిసి ఒక బడా నిర్మాణ సంస్థ నిర్మించబోతోంది. ఒకసారి హీరోయిన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక, అధికారికంగా అనౌన్స్ చేసి సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉంది.
మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు:
భారత పేసర్ మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా హత్య బెదిరింపులు పంపిన దుండగులు.. రూ.కోటి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని షమీ సోదరుడు హసీబ్ సోమవారం ఓ జాతీయ మీడియాకు తెలిపాడు. ఆదివారం మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మెయిల్ వచ్చిందని, వెంటనే ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం అని వెల్లడించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజ్పుత్ సిందార్ అనే వ్యక్తి మెయిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు కూడా బెదిరింపులు వచ్చాయి. ‘ఐ కిల్ యూ’ అంటూ ఈ-మెయిల్స్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు గౌతీ ఫిర్యాదు చేశాడు.