తిరుమల లడ్డూ వ్యవహారం.. ముగ్గురు మంత్రులతో కమిటీ..!
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది.. ఈ వ్యవహారంపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. అయితే, తిరుమల లడ్డు అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్తో కమిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది సర్కార్.. ఈ కమిటీపై త్వరలో అధికారిక ఉత్తర్వుల జారీ చేసే అవకాశం ఉంది.. ఈ కమిటీ ప్రధానంగా తిరుమల లడ్డూ వ్యవహారం.. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టనుంది. అంతేకాక, కూటమిలోని పార్టీల నేతలతో కూడిన మరో కమిటీ కూడా ఏర్పాటు చేయనుంది. రాజకీయ మరియు పాలనా పరంగా తిరుమల లడ్డూ వ్యవహారం పైన పూర్తి విశ్లేషణ చేయడానికి ఈ కమిటీలు కీలకంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే, త్వరలో కూటమి నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల కలకలం..
అనంతపురం జిల్లాలోని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోందది.. నిన్న ఉదయం కారులో టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గరకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు.. నిమ్మకాయలు, తెల్ల నువ్వులను ఎమ్మెల్యే ఇంటి వద్ద విసిరారు. అయితే, ఈ దృశ్యాలను గమనించిన ఎమెల్యే శ్రావణి అనుచరులు వెంటనే కారు నంబర్ ను గమనించి ఆ కారు ని వెంబడించడానికి ప్రయత్నించారు. అయితే, ఆ కారు అప్పటికే అక్కడి నుంచి తప్పించుకుంది.. ఇక, కారు నంబర్ ఆధారంగా వివరాలపై ఆరా తీయగా.. గుంటూరుకు చెందిన వ్యక్తికి చెందిన కారుగా గుర్తించారు.. కానీ, కారు యజమానులు ఈ కారు అప్పటికే వేరే వ్యక్తికి అమ్మినట్టు వెల్లడించారు.. మరోవైపు, ఈ ఘటనపై అలర్ట్ అయిన ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు.. క్షుద్ర పూజలో ఉపయోగించిన నిమ్మకాయలు, నువ్వులను కాల్చివేశారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.. మొత్తంగా టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గర క్షుద్ర పూజల వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, ఇది ఎవరి పని? ఎమ్మెల్యే అంటే గిట్టనివారే ఈ పని చేశారా? లేక రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది..
జోగి రమేష్కు మరో షాక్.. నాన్-బెయిలబుల్ కేసు నమోదు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు.. Cr.No.76/2026 U/s 223, 189(2), 292, 125(2), 126(2), 132 r/w 190 BNS & Sec 32 of Police Act & Sec 7(1)(a) of Criminal Law Amendment Act: (188, 143, 290, 336, 341, 353 r/w 149 IPC) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఎస్సై రవి వర్మ.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, రోడ్లు బ్లాక్ చేశారని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించారని, సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారని జోగి రమేష్ పై కేసులు నమోదు చేశారు..
నేడు దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల స్ట్రైక్.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు!
నేడు దేశవ్యాప్తంగా ర్యాపిడో, ఓలా, ఉబెర్ డ్రైవర్ల స్ట్రైక్ చేపట్టింది. ఈ రోజు (ఫిబ్రవరి 7న) 6 గంటల పాటు “All India Breakdown” కు పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు స్ట్రైక్ కొనసాగనుంది. ఈ సందర్భంగా ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్ల ఆందోళనకు దిగారు. డ్రైవర్లు యాప్లను ఆఫ్ చేసి రైడ్స్కు నిరాకరిస్తున్నారు. పలు నగరాల్లో క్యాబ్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. కనీస బేస్ ఫేర్ లేకపోవడంపై డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, యాప్ కంపెనీల ఇష్టారాజ్యంగా ధరల నిర్ణయంతో డ్రైవర్ల ఆదాయం తగ్గుతుంది. కంపెనీలు ఎక్కువ కమిషన్లు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ప్రయాణ ఛార్జీలు అమలు చేయాలంటున్నారు. ఫేర్ నిర్ణయంలో యాప్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలకు ముగింపు పలకాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాలతో కమర్షియల్ రైడ్స్ నిషేధించాలని డిమాండ్.. ఫేర్ విధానం పారదర్శకంగా ఉండాలని, డిస్కౌంట్ పేరుతో డ్రైవర్లపై భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ స్ట్రైక్ తో ప్రయాణికులపై ప్రభావం పడనుంది. పీక్ అవర్స్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగనున్నాయి. ప్రజా రవాణాపై ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిమాండ్స్ నెరవేర్చకపోతే మరింత తీవ్రమైన ఉద్యమాలు, భవిష్యత్తులో దీర్ఘకాలిక స్ట్రైక్ చేస్తామని ర్యాపిడో, ఓలా, ఉబెర్ డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు.
భారత్కు ట్రంప్ గుడ్న్యూస్.. జరిమానా సుంకం ఎత్తివేత
భారత్-అమెరికా మధ్య సంబంధాలు రోజురోజుకు బలపడుతున్నాయి. గత వారం భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చుతోంది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందంపై తాత్కాలిక ముసాయిదాను అమెరికా విడుదల చేసింది. ఇక రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై విధించిన 25 శాతం జరిమానా సుంకాన్ని ట్రంప్ ఎత్తేశారు. జరిమానాను పూర్తిగా ఎత్తేసినట్లుగా అమెరికా ప్రకటించింది. భారత్ వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లుగా అమెరికా అంగీకరించింది. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. అలాగే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులపై భారతదేశం సుంకాలను తగ్గిస్తుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. భారత్-అమెరికా ఒప్పందంతో భారతీయ చిన్న, మధ్య తరహా సంస్థలు, రైతులు, మత్స్యకారులకు ముప్పై ట్రిలియన్ డాలర్ల భారీ మార్కెట్కు దారి తీస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్లో చెప్పారు. మహిళలు, యువతకు లక్షలాది ఉపాధి అవకాశాలను లభిస్తాయన్నారు. అమెరికా సుంకాలను 18 శాతానికి తగ్గించడం వల్ల వస్త్రాలు, తోలు, ప్లాస్టిక్ వంటి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
ఒబామా దంపతులను కోతులుగా చిత్రీకరిస్తూ ట్రంప్ వీడియో పోస్ట్.. డెమోక్రాట్లు మండిపాటు
బరాక్ ఒబామా.. రెండు పర్యాయలు అగ్ర రాజ్యం అమెరికాను పరిపాలించిన అధ్యక్షుడు. ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలు కలిగిన నేతగా గుర్తింపు పొందారు. అలాంటి నేతపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుచిత చర్యకు పాల్పడ్డారు. బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా దంపతులను కోతులుగా చిత్రీకరించి ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ట్రంప్ పోస్ట్ చేసిన వీడియోలో ‘‘ది లయన్ స్లిప్స్ టునైట్’’ పాట ప్లే అవుతుండగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ముఖాలు కోతి రూపాల్లో ఒక క్షణం పాటు కనిపించాయి. అంతేకాకుండా 2020 ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు. ట్రంప్ పోస్ట్ చేసిన వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇది చాలా అసహ్యకరమైన ప్రవర్తన అంటూ కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పేర్కొన్నారు. ‘‘అధ్యక్షుడి అసహ్యకరమైన ప్రవర్తన. ప్రతి ఒక్కరు రిపబ్లికన్ నేత తీరును ఖండించాలి.’’ అని న్యూసమ్ ఎక్స్లో రాశారు. చరిత్రలో ట్రంప్ ఒక మచ్చ అని.. ‘‘జాత్యహంకరం’’ అని మాజీ జాతీయ భద్రతా సలహాదారు, ఒబామా సన్నిహితుడు బెన్ రోడ్స్ అభివర్ణించారు. ఇక డెమోక్రాట్ల విమర్శలను ‘‘నకిలీ ఆగ్రహం’’గా వైట్హౌస్ కొట్టిపారేసింది.
“మేము రోల్ మోడల్స్”.. భారత్–పాక్ మ్యాచ్ వివాదంపై పాకిస్థాన్ కెప్టెన్ రియాక్షన్..
నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. వచ్చే నెల 8 వరకు ఈ సీజన్ కొనసాగనుంది. అయితే.. ఈ టీ20 వరల్డ్ కప్ పాకిస్థాన్ జట్టుకు పెద్ద సవాలుగా మారింది. భారత్తో మ్యాచ్ బహిష్కరణ చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి మైదానంలో గెలుపుపైనే దృష్టి పెట్టాలని కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా స్పష్టం చేశాడు. “బయట ఏం జరుగుతుందో మేం ఎక్కువగా పట్టించుకోం. జట్టుగా మేం వాటి గురించి మాట్లాడం. అలా చేస్తేనే మన ఆటపై ఫోకస్ పెట్టగలం” అని అన్నాడు. భారత్తో ఫిబ్రవరి 15న జరగాల్సిన మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించాలనే నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. బంగ్లాదేశ్ భద్రతా కారణాలతో భారత్కు రావడం నిరాకరించడంతో వారి స్థానంలో స్కాట్లాండ్ను చేర్చారు. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్కు రెండు పాయింట్లు నష్టమవుతాయి. దాంతో గ్రూప్ దశలో మిగిలిన మూడు మ్యాచ్లు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై స్పందించిన సల్మాన్ “ఇలాంటి వివాదాలు ఆటకు మంచివి కావు. మాకు వ్యక్తిగతంగా బాధగా అనిపించకపోయినా.. క్రికెట్ కోణంలో ఇలా జరగడం మంచిది కాదు. మేము రోల్ మోడల్స్లాంటివాళ్లం. మేము ఏం చేస్తామో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అందుకే ఇలాంటి విషయాలు దూరంగా ఉండాలి.” అని చెప్పాడు.
టీ20 వరల్డ్కప్ ముందు భారత జట్టులో భారీ మార్పులు.. డీఎప్సీ ఎంట్రీకి లైన్ క్లియర్
టీ20 వరల్డ్కప్ 2026 ఈరోజు ( ఫిబ్రవరి 7న) ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. యువ పేసర్ హర్షిత్ రాణా టీం నుంచి తప్పుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన వార్మ్- అప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో మోకాలికి గాయం అయినట్లు బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. నవీ ముంబైలో జరిగిన ఆ మ్యాచ్లో హర్షిత్ కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. గాయానికి సంబంధించిన స్కాన్లు, స్పెషలిస్ట్ డాక్టర్ల సలహా తర్వాత హర్షిత్ టోర్నీలో పాల్గొనటం లేదని బీసీసీఐ వైద్య బృందం తేల్చి చెప్పింది. అతని స్థానంలో డిఎస్పీ మహమ్మద్ సిరాజ్ ని తుది భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఇక, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంపై ఇంకా స్పష్టత రాలేదు అని బీసీసీఐ చెప్పుకొచ్చింది. సైడ్ స్ట్రెయిన్ కారణంగా అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స పొందుతున్నాడు. టీ20 వరల్డ్కప్ ముందు జరిగిన ఐసీసీ అధికారిక ఫోటోషూట్కు కూడా సుందర్ హాజరుకాలేదు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వాషింగ్టన్ సుందర్ పూర్తిగా ఫిట్ అయిన తర్వాతే తుది జట్టులో చేరతాడని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినప్పటికీ, బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక అప్డేట్ రావాల్సి ఉందన్నాడు.
బ్రేకప్ తర్వాత తమన్నా తీసుకున్న సాహసోపేత నిర్ణయం..
అందం అనేది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుంది అంటారు, కానీ తమన్నా అందం మాత్రం అందరికీ ముచ్చటగొలుపుతునది. సుమారు 20 ఏళ్లుగా వెండితెరపై మ్యాజిక్ చేస్తున్న ఈ 36 ఏళ్ల భామ, ఇప్పటికీ కథానాయికగా ‘నాటౌట్’గా కొనసాగుతుంది. ప్రతి సినిమాలోనూ తన లుక్ను మారుస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే తమన్నా, కేవలం హీరోయిన్గానే కాకుండా ఐటెం సాంగ్స్లోనూ తనదైన ముద్ర వేసింది. గతంలో ‘జైలర్’ వంటి చిత్రాల్లో ఒక్క స్పెషల్ సాంగ్ కోసం రూ. 6 కోట్ల వరకు డిమాండ్ చేసిన ఈ బ్యూటీ, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఐటెం గర్ల్గా రికార్డు సృష్టించింది. అయితే మధ్యలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇకపై స్పెషల్ సాంగ్స్ చేయనని ప్రకటించినప్పటికీ, తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్ళీ అగ్ర హీరోల చిత్రాల్లో చిందేయడానికి సిద్ధమవ్వడం హాట్ టాపిక్గా మారింది. తమన్నా కెరీర్తో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇందులో భాగంగానే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో సాగించిన ప్రేమాయణం కొంతకాలం హల్చల్ చేసినా, ప్రస్తుతం వారిద్దరూ విడిపోయారని, ఆ బంధం ‘మూడునాళ్ల ముచ్చట’గానే మిగిలిపోయిందని ప్రచారం జరుగుతోంది.