ఒక్క సెకనులో రూ.6600 కోట్లు రాబట్టిన రతన్ టాటా కంపెనీ
టాటా గ్రూప్ తన కంపెనీల త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడం ప్రారంభించింది. ఆభరణాలు, కళ్లద్దాలను విక్రయించే టైటాన్ కంపెనీ గ్రూప్ శుక్రవారం ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. దీని ప్రభావం ఈరోజు సోమవారం కంపెనీ షేర్లలో కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే, కంపెనీ షేర్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఒక్క సెకనులో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6600 కోట్లు పెరిగింది. రెండవ త్రైమాసికంలో దీపావళి కారణంగా కంపెనీ ఆదాయం, లాభంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కంపెనీ షేర్లు ఏ స్థాయికి చేరుకున్నాయి.. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకుందాం.
ఒరిజినల్ ఆధార్ ఉండాల్సిందే.. జిరాక్స్ చూపిస్తే బస్సు దిగాల్సిందే..
మహిళా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ షాక్ ఇచ్చింది. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం” వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని తేల్చిచెప్పింది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుందని తెలిపారు. పాన్ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని క్లారిటీ ఇచ్చారు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చూపిస్తున్నారని #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చిందని మండిపడ్డారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని స్పష్టం చేశారు. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు.
హిందూపురంపై పెద్దిరెడ్డి ఫోకస్.. టీడీపీ గెలిచి ఏం చేసింది..?
హిందూపురం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది.. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటిస్తూ.. వరుసగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తుండగా.. మరోవైపు.. హిందూపురంపై ఫోకస్ పెట్టారు మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వరుసగా ఆరు రోజులపాటు నియోజవర్గంలో పర్యటించనున్నారు.. ఎన్ని సార్లు హిందూపూర్ ప్రజలు ఒకే పార్టీని గెలిపించినా హిందూపూర్ ఏమి అభివృద్ధి చెందింది.? అని ప్రశ్నిస్తున్నారు.. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి .. బీసీ మహిళలను హిందూపూర్ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా నియమించారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని చెప్పి.. అవి చేతల్లో చూపించే గొప్ప నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చి ఓట్లు ఆశించారు. 2014లో చంద్రబాబు రైతు, మహిళా రుణమాఫీలు అని చెప్పి మోసం చేశారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగా పెన్షన్ మూడు వేలు చేసిన ఘనత వైఎస్ జగన్ దే అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.
రంగంలోకి లగడపాటి… హర్షకుమార్, ఉండవల్లితో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే రాజకీయాలకు గుడ్బై చెబుతానంటూ ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు గుడ్బై చెప్పారు.. ఆ తర్వాత ఎన్నికల సర్వేలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన.. గత ఎన్నికల్లో తన సర్వే ఫలితాలకు.. ఎన్నికల ఫలితాలు భిన్నంగా రావడంతో.. అప్పడి నుంచి సర్వేలకు కూడా స్వస్తి పలికారు.. అయితే, త్వరలోనే లోక్సభ ఎన్నికలతో పాటు.. ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఆయన రాజమండ్రిలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.. అయితే, రాష్ట్ర విభజనతోనే నా రాజకీయ జీవితం ముగిసింది.. నేను ఇకపై ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయబోను అని స్పష్టం చేశారు లగడపాటి..
కుల వృత్తులను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది
కుల వృత్తులను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సచివాలయంలో పొన్నం ప్రభాకర్ ను కుమ్మరుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నడికుడ జయంత రావు, కుమ్మర సంఘం రాష్ట్ర కమిటీ నేతలు కలిసారు. కులవృత్తుల్లొ కుమ్మరుల వృత్తి అంతరించిపోతున్న సందర్భంగా.. వృత్తిని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కి విజ్ఞప్తి చేసారు. 5 ఎకరాల్లో వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసి వృత్తిని కాపాడాలని కోరారు. యంత్రాల ద్వారా మట్టి పాత్రలు తయారు చేయడానికి ఉచిత విద్యత్ అందించాలని తెలిపారు. తయారు చేసిన మట్టి పాత్రలు అమ్ముకునుటకు ప్రభుత్వ స్థలాలో మార్కెట్ లలో షాపులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కుల వృత్తులను కాపాడడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కుల వృత్తులను కాపాడడానికి తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని కుమ్మర సంఘం నేతలకు తెలిపారు.
టీడీపీకి ఏపీ సీఈవో ఎంకే మీనా లేఖ.. వాటిపై వివరణ
టీడీపీకి ఏపీ సీఈవో ఎంకే మీనా లేఖ రాశారు.. గత నెల 23వ తేదీన టీడీపీ ఇచ్చిన రిప్రజెంటేషన్పై తీసుకున్న చర్యలు వివరిస్తూ ప్రత్యుత్తరం రాశారు.. 2024 ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబరు 9 వరకూ వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించాం. డిసెంబరు 9 తేదీ తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా 2024 జనవరి 12 తేదీలోగా పరిష్కరిస్తాం. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించాం. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 14.48 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించాం. అందులో 5 లక్షల 64 వేల 819 పేర్లను అనర్హులుగా తేలింది. అన్ని జిల్లాల కలెక్టర్లూ ఆయా అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఓటర్లుగా ఆన్ లైన్ దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులూ వచ్చాయి. కాకినాడ నగరంలో ఫాం 7ల ద్వారా గంపగుత్తగా ఓటర్లను చేరుస్తున్న 13 మంది ఎఫ్ఐఆర్ ను నమోదు చేశాం. ఈ వ్యవహారంలో పోలీసు స్టేషన్లలో అభియోగపత్రాలు కూడా దాఖలు అయ్యాయని లేఖలో పేర్కొన్నారు.
సాహితీ బాధితులకు న్యాయం చేస్తాం
ప్రీ లాంచింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ సాహితీ ఇన్ఫ్రా చేసిన వసూళ్ల దందాపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని డబ్బు కట్టించుకుని మోసం చేశారని 2022 ఆగష్టులో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ భూదాటి లక్ష్మీ నారాయణపై యశ్వంత్ కుమార్తో పాటు మరో 240 మంది హైదరాబాద్ సీసీఎస్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎండీ లక్ష్మీ నారాయణను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ సీపీ సీసీఎస్ ఏవీ రంగనాథ్ సోమవారం మాట్లాడుతూ.. సాహితీ బాధితులకు న్యాయం చేస్తామని, సాహితీ కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేపడుతామన్నారు.
మా ప్రభుత్వ హయాంలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు..
నిన్న పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా కదలిరా’ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలుపై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈ నేపధ్యంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. తన పుట్టినరోజుకు వచ్చిన జనం కూడా.. నిన్న ఆచంటలో జరిగిన చంద్రబాబు నాయుడు సభకు రాలేదని ఆరోపించారు. మరోవైపు.. రాష్ట్రంలోని రైతులకు కోటి పదిలక్షల గన్ని బ్యాగ్స్ ని ఏర్పాటు చేసినట్లు మంత్రి కారుమూరి పేర్కొన్నారు.
లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జులను నియమించిన బీజేపీ
లోక్సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జులను నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్రెడ్డి సోమవారం నియమించారు. లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్లుగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎ.వెంకట్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఆదిలాబాద్ – పాయల్ శంకర్, పెద్దపల్లి – రామారావు పాటిల్, కరీంనగర్ – సూర్యనారాయణ, నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి, జహీరాబాద్ – కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మెదక్ – పాల్వాయి హరీశ్ బాబు, మల్కాజిగిరి – పైడి రాకేశ్ రెడ్డి, సికింద్రాబాద్ – కె.లక్ష్మణ్, హైదరాబాద్ – రాజాసింగ్, చేవెళ్ల – ఏవీఎన్ రెడ్డి,
మహబూబ్నగర్ – రామచంద్రరావు, నాగర్కర్నూల్ – మాగం రంగారెడ్డి, నల్లగొండ – చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్ – మర్రి శశిధర్రెడ్డి, మహబూబాబాద్ – గరికపాటి మోహనరావు, ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి.
బీఆర్ఎస్ లోక్సభ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
నిజామాబాద్ బీఆర్ఎస్ లోక్సభ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను అధిష్టానం నేతలను కలవకుండా అడ్డుపడ్డ కొందరు నేతలు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారని కవిత వ్యాఖ్యానించారు. జిల్లాలో పార్టీ పనితీరుపై నేతలు అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలని తాజా పలువురు మాజీ ఎమ్మెల్యేల పై పరోక్షంగా కామెంట్స్ చేశారు కవిత. తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో ఓడిపోయాము అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. నిజామాబాదులో ఎంపీ సీటు గెలిచి కేసీఆర్కు గిఫ్ట్ ఇవ్వాలన్నారు.
భారత్-మాల్దీవ్స్ వివాదం.. చైనా కీలక వ్యాఖ్యలు..
భారత్, ద్వీప దేశం మాల్దీవ్స్ మధ్య తీవ్ర దౌత్య ఘర్షణ చెలరేగుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ సందర్శించి, అక్కడి పర్యటకాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవ్స్ ప్రభుత్వానికి నచ్చడం లేదు. దీంతో అక్కడి మంత్రులు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇక భారతీయుల దెబ్బకు ‘బాయ్కాట్ మాల్దీవ్స్’ హాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరోవైపు మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రుల్ని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
కొనసాగుతున్న వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జుల మార్పు కసరత్తు..
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జుల మార్పు కసరత్తుపై చర్చలు కొనసాగుతున్నాయి. సీఎంవో పిలుపుతో పలువురు నేతలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. నందికొట్కూరు నియోజకవర్గ ఇంఛార్జి మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత ఇంఛార్జి బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఇంఛార్జి మార్పుపై కసరత్తు చేస్తుంది అధిష్టానం. మరోవైపు.. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను బైరెడ్డి కలిశారు. నందికొట్కూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నందికొట్కూరుకు కొత్త అభ్యర్థి ఎంపికపై సీఎం చర్చిస్తోన్నారు.
బిల్కిస్ బానో తీర్పు.. అహంకార బీజేపీపై విజయం..
బిల్కిస్ బానో కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గతంలో గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ద్వారా విడుదల చేసిన 11 నిందితులను ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై కాంగ్రెస్తో సహా ఇతర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది న్యాయం సాధించిన విజయమని, బీజేపీ మహిళా వ్యతిరేకి అని, నేరస్తులను ప్రోత్సహిస్తోందని ఆరోపించాయి.
తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. బిల్కిస్ బానో అవిశ్రాంత పోరాటం బీజేపీ అహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ విజయంగా అభివర్ణించారు. ఎన్నికల ప్రయోజనాల కోసం న్యాయాన్ని చంపేసే ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని, ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు నేరస్తులను పెంచి పోషిస్తుంది ఎవరనే విషయాన్ని దేశానికి చాటి చెప్పిందని రాహుల్ ఎక్స్(ట్విట్టర్) లో వ్యాఖ్యానించారు.
ముగిసిన నర్సరావుపేట పంచాయతీ..
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో నర్సరావుపేట పంచాయతీ ముగిసింది. రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో సర్దుబాటు కసరత్తు చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఆయన వ్యతిరేక వర్గం వాదనలు విన్న విజయసాయిరెడ్డి.. ఇరువర్గాల మధ్య సర్దుబాటు చేశారాయన. అంతేకాకుండా.. పార్టీ విజయం కోసం పనిచేయాలని విజయసాయి రెడ్డి వారికి సూచించారు.