ముంచుకొస్తున్న తుఫాన్.. జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి… మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా తీరం వెంబడి అధికారులు తగిన చర్యలు చేపట్టారు .. తుఫాను తీవ్రతరం అవుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకి రావద్దని చెపుతున్నారు.. మరోవైపు.. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. బాపట్ల – కాటమనేని భాస్కర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ – జయలక్ష్మి, తూర్పు గోదావరి – వివేక్ యాదవ్, కాకినాడ – యువరాజ్, ప్రకాశం – ప్రద్యుమ్న, నెల్లూరు – హరికిరణ్, తిరుపతి – జె.శ్యామలరావు, పశ్చిమ గోదావరి – కన్నబాబును నియమించారు ఉన్నతాధికారులు.. ఆయా జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేయడం.. ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా చూసేందుకు ప్రత్యేకాధికారులు కృషి చేయనున్నారు.
మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. 151 రైళ్లు రద్దు
మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.. ఏకంగా 151 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో 151 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.. తెలంగాణ వైపుగా తూర్పు దిశ నుంచి గాలులు బలంగా వీస్తున్నాయి.. ఇప్పటికే తెలంగాణకి ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాలపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావించిన సౌత్ సెంట్రల్ రైల్వే.. ఉభయ రాష్ట్రాల మీదుగా నడిచే 151 రైళ్లను రద్దు చేసింది.. మరోవైపు.. తుఫాన్ ప్రభావంపై 8 జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని.. హుద్హుద్ లాంటి పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉంది.. ఇప్పుడు అప్రమత్తంగాఉంటూ, యంత్రాంగం సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.. బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
లోకేష్కి ద్వారంపూడి సీరియస్ వార్నింగ్.. నాలుక కట్ చేస్తా..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లేనిపోని ఆరోపణలు చేస్తే లోకేష్ నాలుక కట్ చేస్తాను అంటూ హెచ్చరించారు. లోకేష్ కొవ్వు కరిగించుకోవడానికి పాదయాత్ర చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. నీ ఎర్ర బుక్ మడత పెట్టుకో.. కాకినాడలో దొంగ బియ్యం ఎగుమతి అవుతుందో లేదో.. పయ్యావుల వియ్యంకుడైన సైరస్ కంపెనీ యాజమాని శ్రీనివాస్ ను అడుగు అని సూచించారు. ఆయన కాకినాడలో టాప్ త్రీ రైస్ ఎక్స్పోర్టర్.. మీ సామాజిక వర్గమే అన్నారు. ఇక, తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్ ప్రభావం లేదన్నారు ద్వారంపూడి.. సెటిలర్లు, టీడీపీ వాళ్లు బీఆర్ఎస్ ను ఆదరించారు.. కానీ, టీడీపీని సపోర్ట్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు.. రేవంత్ రెడ్డికి టీడీపీ మచ్చ ఉంటే ఎంతోకాలం సీఎంగా ఉండలేడంటూ జోస్యం చెప్పారు.. మరోవైపు.. తెలంగాణ ఎన్నికల్లో పరాజయానికి పవన్ కల్యాణ్కు కంగ్రాట్స్ చెబుతూ సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాగా, యువగళం పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేష్.. ఎమ్మెల్యే ద్వారంపూడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. కాకినాడ రూరల్ లో ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా చెయ్యలేదు.. ఇక, కాకినాడ సిటీ అభివృధి జరగలేదు.. కానీ, ద్వారంపూడి కుటుంబం బాగుపడిందని ఆయన దుయ్యబట్టారు.. ప్యారడైజ్ సిటీని డ్రగ్స్ సిటీగా మార్చేశారు.. చంద్రశేఖర్ రెడ్డి పేరు దోపిడీ శేఖర్.. చేయని అవినీతి లేదు. సీఎం వైఎస్ జగన్ కి బినామీనే ఈ దోపిడీ శేఖర్ అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే.
తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసింది.. ఇక, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..
రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయాల్లో మార్పు వచ్చింది.. తెలంగాణలో భాష మారబోతోంది.. ఇక, నీచమైన రాజకీయాలకు స్వస్తి పలకాలి అని ఆయన కోరారు. బీజేపీ 8 స్థానాలకు పరిమితమయింది.. బీజేపీ ఎందుకు వెనక్కి పోయింది అనే దానిపై చర్చ అవసరం.. బీజేపీ ఫలితాలపై చర్చ జరగాలి అని ధర్మపురి అర్వింద్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక్కటి అని ప్రచారం చెయ్యడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది.. బీఆర్ఎస్ ఇక నిలబడదు.. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారనుంది అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పుకొచ్చారు. నేను చెట్టు పేరు పెట్టి కాయలు అమ్ముకొను అని ధర్మపురి అర్వింద్ అన్నారు. మాకు అభ్యర్థి లేని చోట కోరుట్లలో పోటీ చేసి.. పార్టీకి బలం పెంచి సక్సెస్ అయ్యాను.. డబ్బు పంచడంలో రాజకీయాలను దారుణంగా తయారు చేశారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పెరగడం కూడా నా ఓటమికి కారణమే.. కేసీఆర్ బయటకు రావొద్దని కోరుకుంటున్నాను.. మేం సగం సంతోషంగా ఉన్నాం.. ఇక, తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసింది అని ధర్మపురి అర్వింద్ అన్నారు.
సిట్టింగ్ సీఎంను.. కాబోయే సీఎం అంటున్న ఇద్దరినీ ఓడించిన ఘనత బీజేపీదే
గత ఎన్నికల తో పోలిస్తే కాంగ్రెస్ కు పెరిగిన ఓట్ల కన్నా ఎక్కువ శాతం ఓట్లు బీజేపీ పొందింది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఫలితాలను సమీక్షించుకుని.. మంచి పలితాలు సాధించేందుకు కృషి చేయబోతున్నామన్నారు. కార్యకర్తలు నిరాశ నిస్పృహలు లోనూ కాకుండా ముందుకు వెళ్ళాలని కోతుకుంటున్నారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డబ్బు మద్యాని ఎదుర్కొని కార్యకర్తలు పార్టీ కోసం పని చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది.. కాంగ్రెస్ కి తెలంగాణలో అలాంటి ఫలితాలు రాలేదు అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. అయినా.. ఒక సిట్టింగ్ సీఎంను.. కాబోయే సీఎం అంటున్న ఇద్దరినీ ఓడించిన ఘనత బీజేపీ దే అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డినీ ఓడించిన వెంకట రమణ రెడ్డి విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు అని ఆయన పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గెలువబోతున్నారు.. కేంద్రంలో హ్యాట్రిక్ ప్రధాని కాబోతున్నారు అంటూ వ్యాఖ్యనించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకే వేస్తామని ప్రజలు మాకు చెప్పారు.. మోడీకే మా ఓటు అని స్పష్టం చేశారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటర్లు సైతం లోక్ సభ ఎన్నికల్లో మాకు ఓటు వేస్తామని చెప్పారు అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో ప్రారంభమైన రాజీనామాల పర్వం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్ననే వచ్చాయి.. అయితే, ఈ రోజు రాజీనామాల పర్వం ప్రారంభమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ, ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవడంతో.. ఇన్నాళ్లు కేసీఆర్ సర్కార్ తో ప్రయాణం చేసిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు తమ పోస్టులకు రిజైన్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా ఉన్న దేవులపల్లి ప్రభాకర్ రావు తన పదవికి రీజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. 2014 జూన్ 5న జెన్ కోం సీఎండీగా పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రావు.. అదే సంవత్సరం 25న ట్రాన్స్ కో ఇంఛార్జ్ గా ప్రభుత్వం నియమించింది. అయితే, ప్రభుత్వం మొదట ప్రభాకర్ రావును రెండేళ్ల పదవీ కాలానికే సీఎండీగా నియమించింది.. ఆ తర్వాత తన పదవీ కాలాన్ని పొడిగిస్తూ వెళ్లింది.. కాగా, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటంతో తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కాగా.. ప్రభాకర్ రావు జెన్ కో సంస్థకు మొత్తం 54 ఏళ్ల పాటు తన సేవలను అందించారు. ఇక మరోవైపు, సాంస్కృతిక సలహాదారుడిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి కూడా తన పదవికీ రిజైన్ చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎస్ శాంతికుమారికి పంపించారు. అలాగే, కాగా, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ప్రభాకర్ రావు సైతం రాజీనామా చేశారు. గత కొన్నాళ్లుగా ఇంటెలిజెన్స్ లో ఓఎస్డీ ఆయన కొనసాగుతున్నారు.
యూపీలో విషాదం.. గుడిసెలో మంటలు అంటుకుని ముగ్గురు చిన్నారులు మృతి
ఉత్తరప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గుడిసెలకు నిప్పంటుకుని అందులో ఉన్న ముగ్గురు చిన్నారులు మృత్యువాత చెందారు. ఈ ఘటన జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదిత్ గ్రామంలో జరిగింది. శనివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. డేరా బంజారా ప్రాంతంలోని తమ గుడిసెలో రాత్రిపూట పిల్లలు నిద్రిస్తుండగా మంటలు వ్యాపించాయి. దీంతో మంటలు చెలరేగగా.. ముగ్గురు చిన్నారులు అగ్నికి ఆహుతైనట్లు పోలీసులు పేర్కొన్నారు. పిల్లలను రక్షించేందుకు వారి తండ్రి షకీల్ ప్రయత్నించాడు. కానీ ఎంతకు కాపాడేందుకు వీలుకాకపోవడంతో ఇద్దరు మంటల్లో కాలిపోగా, ఒక చిన్నారిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి కూడా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు రక్షించబోయిన తండ్రికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నట్లు రూరల్ ఎస్పీ రణవిజయ్ సింగ్ తెలిపారు.
కడపలోని పెద్ద దర్గాను సందర్శించిన నాని.. పిక్స్ వైరల్..
హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ క్రమంలో నాని అండ్ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.. డిసెంబర్ 7 న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నారు.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఈమూవీ రిలీజ్ కానుంది.. రీసెంట్ గానే ఈమూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా కడప వెళ్లారు నాని. అక్కడ ప్రమోషన్లు పూర్తయిన తరువాత ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా ను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఆయనకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.. అక్కడ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నాని పెద్ద దర్గాకు రావడంతో చుట్టుపక్కల కోలాహలం నెలకొంది.. నాని రావడం తెలుసుకున్న అభిమానులు అక్కడకు భారీ ఎత్తున చేరుకున్నారు..
రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన టీమ్..
టాలివుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’.. యంగ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ నితిన్ కు జంటగా నటిస్తుంది.. సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్.. ట్రైలర్లు అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఈ మూవీ లో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా… రావు రమేష్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. హరిజ్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్స్ ను, పాటలను రిలీజ్ చేస్తూ వస్తుంది.. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది..
అవార్డ్స్ కోసం పిలిచి అవమానిస్తావా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
సంతోషం అవార్డ్స్ వేడుకలో కన్నడవారికి అవమానం జరిగిందని ఒక జర్నలిస్ట్ ట్విట్టర్ ద్వారా తెలుపడంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె అందులో ఏం చెప్పిందంటే.. ” కన్నడ నుంచి అవార్డ్స్ ను తీసుకోవడానికి నటుడు రమేష్ అరవింద్, సప్తమిగౌడ, రాగిణి ద్వివేదితో పాటు పలువురు కన్నడ నటీనటులు వచ్చారు. ఇక వారు అవార్డ్స్ తీసుకొనే టైమ్ లో లైట్స్ ఆఫ్ చేసి అవమానించారు. అనంతరం.. వారు స్టే చేసే హోటల్ బిల్స్ ను నిర్వాహకులు కట్టకపోవడంతో హోటల్ యాజమాన్యం.. నిర్మొహమాటంగా వారిని బయటకు పంపి రూమ్స్ కు లాక్ చేసారు. ఇక దీంతో చేసేదేమి లేక వారు రిసెప్షన్ లో నిలబడి.. సురేష్ కొండేటి కాల్ కోసం ఎదురుచూసారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరికి పోలీసులు జోక్యంతో అక్కడ ఉన్నవారు బయటపడ్డారు” అని రాసుకొచ్చింది. ఇక ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్వీట్ చూసిన కన్నడ నటీనటులతో పాటు ఫ్యాన్స్ సైతం సురేష్ కొండేటిపై ఫైర్ అవుతున్నారు. అవార్డ్స్ కోసం పిలిచి అవమానిస్తావా.. ? ఇదేనా మీ బుద్ధి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక తెలుగు వారు సైతం సురేష్ ను ఏకిపారేస్తున్నారు. ఈవెంట్ జరుగుతుంది అంటే అన్ని సరిచూసుకోవాలి కదా.. ఇలా వారిని అవమానిస్తే.. మన పరువే పోతుంది. ప్రశ్నలు అడగడం కాదు.. ఇలాంటివి మేనేజ్ చేయాలి అంటూ ఏకిపారేస్తున్నారు.
సురేష్ కొండేటి ఏమన్నాడంటే.. ?
ఇక ఈ వివాదంపై సురేష్ కొండేటి స్పందించాడు. ” అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను .. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం . దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు .. ప్రతి సం చాలా కష్టపడి, గ్రాండ్ గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను .. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే .. అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నాను. గోవా ఈవెంట్ లో జరిగిన కొంచం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్ కి రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్ లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్ , అది ఉదేశ్య పూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను నా మీద కావాలనే కొంత మంది కావాలని బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ సురేష్ కొండేటి” అంటూ రాసుకొచ్చాడు. ఏదిఏమైనా ఈ వివాదంతో సురేష్ కొండేటి పేరు మాత్రమే కాకుండా టాలీవుడ్ పేరు కూడా కన్నడ నాట నానుతుంది అన్నది వాస్తవం. మరి ఇది ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.