టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ సవాల్ చేసిన విషయం తెలిసిందే. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని పేర్కొంది. టీడీపీ ఛాలెంజ్ను భూమన స్వీకరించారు. గురువారం ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన తెలిపారు. గోశాలకు వెళ్లేందుకు టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు పోలీసుల అనుమతి లభించింది. మరికొద్దిసేపట్లో ఆయన గోశాలకు బయల్దేరనున్నారు.
ఈరోజు ఉదయం భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఆ హౌస్ అరెస్టు ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. భూమన కరుణాకర్ రెడ్డిని గృహనిర్బంధం చేయలేదని తిరుపతి ఎస్పీ హర్ష వర్ధన్ రాజు స్పష్టం చేశారు. గోశాలకు వెళ్లడానికి భూమనకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, రెండు పార్టీల నేతలు ఒకేసారి వెళ్లకూడదని సూచించామన్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందితో భూమన వెళ్లవచ్చని చెప్పమని తిరుపతి ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గోశాలకు వెళ్లాలని సూచించారు.