తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శనివారం మధ్యాహ్నం నుంచి వాతారణం చల్లబడింది. మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. చల్లని వాతావరణంలో భక్తులు సేదతీరారు. వరుసగా మూడో రోజు తిరుమలలో వర్షం కురిసింది. రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేళ తిరుమలలో గత రెండ్రోజులుగా వాతావరణం మారిపోయింది. శుక్రవారం సైతం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షానికి పలు ప్రదేశాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ కాసినప్పటికీ 12 గంటల తర్వాత వాతావరణం మారిపోయింది. నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి. ఆ తర్వాత సుమారు గంటన్నర పాటు వర్షం కురిసింది. వర్షంతో తిరుమలలో చలి తీవ్రత పెరిగి.. ఈదురుగాలులకు కౌస్తుభం, డీటైప్ క్వార్టర్స్, రింగ్ రోడ్డు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.
READ MORE: Canada: ఖలిస్తాన్ ఆందోళనలపై రాజకీయాలను ప్రభావితం చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి విశ్వరూపంతో నిప్పులకొలిమిలా మారాయి. మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండిపోతున్న ఎండల ధాటికి జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఎండలకు తోడు వడగాలులు వీస్తుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు పొడి వాతావరణం, దక్షిణ నైరుతి దిశల నుంచి గాలుల ప్రభావం వల్ల వడగాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.