ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం అభాసు పాలవుతుంటే.. ఇవేమీ పట్టించుకోకుండా మీరు సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారు.. చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే స్థితికి మీరు దిగజారారు అని ఆయన అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచలేదు సరికదా.. మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసి వంట కార్మికులకు ఆర్థిక భారంతో పాటు పనిభారం పెంచారు.. చాలా పాఠశాలల్లో వంట గదులే సక్రమంగా లేవు.. చెట్ల కింద వంటలు కొనసాగుతున్న పరిస్థితి.. దీనివల్ల అక్కడక్కడ మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థకు గురైన సందర్భాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also: Weather alert : పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
మధ్యాహ్న భోజన కార్మికులు గత కొన్ని రోజులుగాలు ధర్నాలు చేస్తున్న పట్టించుకున్న పాపాన పోలేదు మీ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 8 ప్రకారం పెరిగిన వేతనాలను ఏరియర్స్ తో సహా వెంటనే చెల్లించాలన్న వారి డిమాండ్లను పట్టించుకోలేదు.. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ ఇంత అధ్వాన్నంగా ఉంటే.. ఆ పరిస్థితులపై ఒక్క సారి కూడా మీరు సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదు అని ఆయన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకంలోని సమస్యలతో పాటు కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి.. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.