నకిలీ డాక్టర్లపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి చర్యలు తీసుకుంటుంది. ఎలాంటి అర్హత లేకుండానే చాలా మంది వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో.. హైదరాబాద్లోని ఐడీపీఎల్, చింతల్, షాపూర్నగర్ (IDPL, Chintal, Shapurnagar) ప్రాంతాల్లో నకిలీ క్లినిక్ లపై అధికారులు సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్(Antibiotics) ఇస్తున్నట్లు గుర్తించారు. తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక.. వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు గుర్తించారు.
Read Also: Haryana: ఎన్నికల వేళ విషాదం.. గుండెపోటుతో యువ ఎమ్మెల్యే మృతి
దాదాపు యాభై మంది నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, ఇద్దరిని జైలుకు పంపినట్లు తెలుస్తుంది. తనిఖీల్లో డాక్టర్ ప్రతిభాలక్ష్మి, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ సన్నీ డేవిస్, డాక్టర్ ఇమ్రాన్ అలీ, డాక్టర్ కే. విష్ణు, పాండు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హత కలిగిన వైద్యుల వద్దకే వెళ్లాలని చెబుతున్నారు.
Read Also: R.S. Praveen Kumar: రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజు రోజుకు అడుగంటి పోతున్నాయి..