Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అలా తెరపడిందో లేదో.. నిర్మల్ జిల్లాలోని భైంసాలో ఇలా ఘర్షణకు తెరలేచింది. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంటిలో డబ్బుల డంప్ ఉందనే సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ టీమ్తో పోలీసులు సోదాలు చేశారు. దాంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
తమ దగ్గర డబ్బులు లేవని బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆపై జరిగిన దాడిలో పలువురు పోలీసులకు, కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న పలు కార్ల అద్దాలు ద్వంసం అయ్యాయి. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: IND vs AUS: ఇషాన్ కిషన్ తప్పిదమే ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది!
మరోవైపు కామారెడ్డి, కరీంనగర్లో కూడా ఘర్షణకు తెరలేచింది. ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానికేతరులు ఇతర నియోజకవర్గాల్లో ఉండకూడదు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి వెంటనే కామారెడ్డిలో ఉండగా.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. అయితే కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి తరపున తాను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నానని చెప్పారు. ఓవైపు పోలీస్ బలగాలు, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా గుమికూడారు. పరస్పర వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.