తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాల్లో పార్టీ గెలిచిన వెంటనే జరగాల్సిన సీఎం ఎంపిక వాయిదా పడింది. ముఖ్యమంత్రి పదవి ఎవరికివ్వాలనే గొడవ ఈజీగా తేలేలా కనిపించడం లేదు.. సీఎం ఎంపిక కోసం ఇవాళ (సోమవారం) హైదరాబాద్లో జరగిన ప్రయత్నాలేవీ సక్సెస్ కాలేదు.. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో జరిగిన ఎమ్మెల్యేల మీటింగ్లో ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Read Also: Telangana Assembly Election 2023: బీఆర్ఎస్ ఎందుకు ఓడింది..? పరాజయానికి దారితీసిన అంశాలేంటి..?
ఇక, నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించే బాధ్యతను అధిష్టానానికి ఇచ్చారు. దీంతో సీన్ ఒక్కసారిగా ఢిల్లీకి వెళ్లింది. ఏఐసీసీ ముఖ్య పరిశీలకునిగా వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడంతో కథ మళ్లీ ఫస్ట్ కి వచ్చింది. ఎమ్మెల్యేల మీటింగ్ నుంచి అలిగి బయటికి వెళ్లిన భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
Read Also: Karnataka: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తనపై కత్తితో దాడి చేశారు.. బీజేపీ నేత పృథ్వీ సింగ్ ఆరోపణ..
అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఇప్పటికే రేసులో ఉన్న అగ్రనేతలెవరూ పట్టు వీడడం లేదు.. తామూ సీఎం పదవికి అర్హులమేనని ఢిల్లీ వెళ్లి హై కమాండ్కు మొర పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. దీంతో రేసులో ఉన్నవారందరి పేర్లు పరిగణలోకి తీసుకుని త్వరలో ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుంది అనుకుని ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాటు కూడా చేశారు.. అయితే, సీఎం అభ్యర్థి ఎవరో తెలియకపోవడంతో రాజ్భవన్ నుంచి పోలీసులు వెళ్లిపోయారు.
Read Also: Karnataka: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తనపై కత్తితో దాడి చేశారు.. బీజేపీ నేత పృథ్వీ సింగ్ ఆరోపణ..
కాగా, సీఎం ఎవరనేదానిపై రేపు (మంగళవారం) క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులు రేపు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయాన్ని ఆయన వెల్లడిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యూ కట్టనుండడంతో ఒక్కరోజులో అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తుందా లేదా అనేదానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు, ఇవాళ సమావేశమైన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బస చేస్తున్నారు. సీఎం అభ్యర్థి ఖరారు అయ్యే వరకు వారంతా అక్కడే ఉండనున్నారు.