NTV Telugu Site icon

CM Revanth Reddy : రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు.. ప్రతినెలా రూ.600 కోట్ల వడ్డీనే కడుతున్నాం

Revanthreddy

Revanthreddy

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో వివరించారు. ఆయన మాట్లాడుతూ, మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను కేసీఆర్ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అప్పుల వల్ల రాష్ట్రం ప్రతినెలా రూ.600 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.

కేసీఆర్ పదేళ్ల పాలనలో ఉద్యోగులకు ఎప్పుడూ మొదటి తేదీన వేతనాలు ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా, కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఆయన పాలనలో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ల హామీలు ఇచ్చినా, అధికారంలో ఉన్నప్పుడు వాటిని అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Gyanesh Kumar: కుంభమేళలో పాల్గొన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్.. కుటుంబ సభ్యులతో కలిసి స్నానం

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఏడాది వ్యవధిలోనే 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, ఇందులో 11,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కూడా చేపట్టామని వెల్లడించారు. అంతేకాదు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా పూర్తిస్థాయిలో సేవా నిధులు అందించలేని స్థితికి రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం నెట్టివేసిందని విమర్శించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.8 వేల కోట్ల పెండింగ్‌ బకాయిలు ఉండగా, తమ ప్రభుత్వం వచ్చాక వాటిని చెల్లించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలను నిర్లక్ష్యం చేసిందని, దీని వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని, పదోన్నతులు, బదిలీలను అమలు చేసినట్లు వివరించారు.

రాహుల్ గాంధీ ఆశయాల మేరకు తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎవరూ చేయలేని సాహసం చేసి, కులగణనను చేపట్టిందని ప్రకటించారు. వందేళ్లుగా జరగని కులగణనను సమర్థవంతంగా నిర్వహించి, సామాజిక న్యాయం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులగణనను మరింత విస్తృతంగా అమలు చేస్తామని అన్నారు.

కేసీఆర్‌పై తన విమర్శలను మరింత తీవ్రతరం చేసిన రేవంత్ రెడ్డి, ప్రజలు ఆయనను తిరస్కరించినప్పటికీ ఆయనలో మార్పు రాలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా, ప్రజల తీర్పును గౌరవించకుండా కేసీఆర్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రజా సేవను విడిచిపెట్టి ఫామ్ హౌస్‌ రాజకీయాల్లో మునిగిపోయారని, తెలంగాణ ప్రజలకు అతనిలో ఇక నమ్మకం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పేగు బంధం తెంచుకొని పార్టీ పేరు కూడా మార్చుకోవడం రాజకీయ దివాళా తీయడమేనని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని, ప్రజలు వాటిని గమనించి మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.

IND vs PAK: పని చేయని పాకిస్తాన్ కెప్టెన్ ట్రిక్.. మంత్రాలు చేసినప్పటికీ ఓటమి