ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు టీడీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి రావత్ కు లేఖ రాసినా వివరాలు ఇవ్వకపోవడంతో మంత్రి బుగ్గనకు ఆయన లేఖ రాశారు. మండలి ప్రతిపక్ష నేతగా తానడిగిన వివరాలు ఇవ్వాలని బుగ్గనను యనమల కోరారు. 2021-22 ఏడాదికి కాగ్ ఇచ్చిన నివేదికని లేఖలో ఆయన ప్రస్తావించారు. 67 ప్రభుత్వ రంగ సంస్థలు ఆడిట్ సంస్థకు లెక్కలివ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Read Also: Prabhas: డైనోసర్ దిగుతోంది.. ఇక పక్కకి తప్పుకోండి!
ఏపీ ఆర్ధిక వ్యవస్థపై 2021-22 సంవత్సరానికి కాగ్ ఇచ్చిన నివేదిక ఏపీ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోంది అని టీడీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాగ్ నివేదిక ఆందోళన కలిగిస్తోంది.. ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది.. ఐదేళ్లల్లో మేం 1.39 లక్షల కోట్ల రూపాయల మేర అప్పు చేస్తే నాడు ప్రతిపక్ష నేతగా జగన్ చాలా ఆందోళన చెందారు.. జగన్ సీఎం అయ్యాక మూడేళ్లల్లోనే మూడింతల మేర 3.25 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు అంటూ ఆయన మండిపడ్డారు.
ఏపీలో 97 పబ్లిక్ సెక్టార్ సంస్థలుంటే.. 30 సంస్థలే ఆడిట్ లెక్కలు చూపాయని కాగ్ స్వయంగా చెప్పింది అని యనమల అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికి రాష్ట్ర అప్పుల వాస్తవ పరిస్థితి తెలియ చేయాలి.. ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్లు, విద్యుత్ సంస్థలకున్న బకాయిల వివరాలివ్వాలి.. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధుల ఖర్చు లెక్కలు అందించాలి అని ఆయన డిమాండ్ చేశారు.