TCS Nashik case: ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ నాసిక్ బీపీఓ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉన్నత స్థానంలో ఉన్న కొందరు ముస్లిం ఉద్యోగులు ఒక కుట్ర ప్రకారం హిందూ మహిళల్ని, ఇతర ఉద్యోగుల్ని టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళలపై లైంగిక వేధింపులు, బలవంతంగా మతమార్పిడులు, మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించడం వంటి ఆరోపణల్ని నిందితులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో, ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఇలాంటి చర్యలు ఉగ్రవాద చర్యల పరిధిలోకి వస్తాయని పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది. చట్టవిరుద్ధమైన మతమార్పిడులు అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. టీసీఎస్ నాసిక్ కేసు కేవలం ఒక్కటే కాదని, ఇది పెద్ద వ్యవస్థీకృత, బలవంతపు ప్రచారంలో భాగమని పిటిషనర్ వాదించారు.
Read Also: Ashok Leyland: అశోక్ లేలాండ్ కొత్త వాణిజ్య వాహనం దోస్త్ విడుదల.. స్పెసిఫికేషన్స్, ధర పూర్తి వివరాలు
మోసపూరిత మరియు బలవంతపు మత మార్పిడులు దేశ ఐక్యతకు, భద్రతకు తీవ్రమైన ముప్పు అని పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. భారతదేశ జనాభా సమతుల్యతను మార్చడానికి విదేశీ సంస్థల నిధులతో నడిచే ఒక వ్యవస్థీకృత కుట్ర కిందకు వస్తాయని పిటిషనర్ వాదించారు. ఇలాంటి కార్యకలాపాలు దేశ సమగ్రతకు ప్రమాదకరమని, దీని వల్ల ఉగ్రవాదానికి సంబంధించిన చట్టాల కింద పరిగణించాలని కోరారు. మత స్వేచ్ఛ హక్కు సంపూర్ణమైంది కాదని, అది ప్రజాభద్రత, నైతికతకు లోబడి ఉంటుందని పిటిషన్ నొక్కి చెప్పారు.
ఈ కేసులో 9 మంది బాధితులు నిందితులపై ఫిర్యాదు చేశారు. వీరిలో చాలా మంది మహిళలే. అనుచితంగా తాకడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, లైంగిక వేధింపుల వంటి నేరాలకు నిందితులు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసులో ఏడుగురు నిందితులు ఒక గ్రూప్గా పనిచేస్తూ ఈ అరాచకాలకు పాల్పడినట్లు నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ చెప్పారు. ఈ కేసులో ఏడుగురు పురషులు, ఒక మహిళ సహా 8 మందిని అరెస్ట్ చేయగా, వీరికి సహకరించిన హెచ్ ఆర్ మేనేజన్ నిదా ఖాన్ పరీరాలో ఉంది. వివాదాల నేపథ్యంలో టీసీఎస్ నాసిక్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశించింది.