Suryakumar Yadav: భారత టీ20 క్రికెట్లో ఓ అంశం హాట్ టాపిక్ మారింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ భవిష్యత్తు ఏంటి? అతడు కెప్టెన్గా కొనసాగుతాడా లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై బీసీసీఐ (BCCI) సీనియర్ అధికారిని ఉటంకిస్తూ తాజాగా పీటీఐ (PTI) వార్తా సంస్థ సంచలన నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్సీ భవితవ్యం ఇప్పుడు పూర్తిగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే, సూర్యకుమార్ను కేవలం ఒక బ్యాటర్గా మాత్రమే జట్టులోకి తీసుకోవడానికి జాతీయ సెలెక్షన్ కమిటీ అంతగా మొగ్గు చూపడం లేదు. గత ఐపీఎల్ సీజన్ తరహాలోనే ఈసారి సైతం సూర్యకుమార్ యాదవ్ 700 పైగా పరుగులు చేసి ఫామ్లోకి వస్తాడని సెలెక్టర్లు ఆశించారు. కానీ, ఆశ్చర్యకరంగా సూర్య తన ఆటలో ఎలాంటి సాంకేతిక మార్పులు చేసుకోలేకపోయాడు. కనీసం అనుభవం లేని కొత్త బౌలర్లు వేసే స్ట్రెయిట్ హార్డ్ లెంగ్త్ బంతులను సైతం ఎదుర్కొలేక చేతులెత్తేస్తున్నాడు. దీనిని గమనించిన సెలెక్టర్లు.. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో ఆడే భారత జట్టులో సూర్యకుమార్ ఉంటాడని అనుకోవడం లేదట. ఒకవేళ కోచ్ గంభీర్ గనుక సూర్యకుమార్కు మరో సిరీస్ ఇచ్చి ఆఖరి అవకాశం ఇవ్వాలని భావిస్తే తప్ప, అతడి కెప్టెన్సీ ముగిసినట్లేనని సదరు బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు.
మరోవైపు భారత క్రికెట్ వర్గాల్లో సూర్యకుమార్ స్థానంలో కొత్త కెప్టెన్ ఎవరు వస్తారనే చర్చలు అప్పుడే మొదలయ్యాయి. ఈ రేసులో శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపిస్తోంది. అయ్యర్కు మంచి వ్యూహాత్మక చతురత, బలమైన వ్యక్తిత్వం ఉన్నాయి. అయితే, కోచ్ గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ కలిసి సజావుగా పనిచేయగలరా లేదా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే, 2024 ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించినప్పుడు, ఆ క్రెడిట్ అంతా మెంటార్గా ఉన్న గంభీర్కే దక్కింది. ఆ సమయంలో కెప్టెన్గా ఉన్న శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తికి గురైన విషయాన్ని బోర్డు వర్గాలు ఇంకా మర్చిపోలేదు. ఇక ఈ రేసులో ఉన్న మరో ముఖ్యమైన పేరు శుభ్మన్ గిల్. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టును సమర్థవంతంగా నడిపించడంతో పాటు, బ్యాటర్గా మరోసారి భారీగా పరుగులు సాధించడంతో గిల్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. నిజానికి టీ20 వరల్డ్ కప్కు ముందు గిల్ ఫామ్ కోల్పోవడంతో అతడి కెప్టెన్సీ ప్రణాళికలు పక్కకు పోయాయి కానీ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బృందం మొదట గిల్నే అన్ని ఫార్మాట్లకు దీర్ఘకాలిక కెప్టెన్గా భావించింది. ఇప్పుడు సూర్యకుమార్ గనుక కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే, గిల్ మళ్లీ టీ20 జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. కాకపోతే ఇందులో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. ఒకవేళ గిల్ వస్తే అతడు ఓపెనర్గా, సంజూ శాంసన్ మూడో స్థానంలో, ఇషాన్ కిషన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చేలా టీమ్ మేనేజ్మెంట్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయవచ్చు.
ఇదే సమయంలో భారత క్రికెట్లో అత్యంత వేగంగా దూసుకొస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు సైతం తెరపైకి వస్తోంది. 2028 ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ టీనేజ్ ప్లేయర్ను వేగంగా సీనియర్ జట్టు వైపు ప్రమోట్ చేస్తున్నారు. ఇది భవిష్యత్తు కెప్టెన్సీ రేసును మరింత ఆసక్తికరంగా మార్చింది. వీరితో పాటు సెలెక్టర్ల ఆలోచనల్లో నిశ్శబ్దంగా దూసుకొస్తున్న మరో పేరు తిలక్ వర్మ. ఒకవేళ సూర్యకుమార్పై వేటు పడితే తిలక్ వర్మను కూడా తక్కువ అంచనా వేయలేం. అందుకే సెలెక్టర్లు అతడి నాయకత్వ ప్రతిభను పరీక్షించడానికి ముక్కోణపు ‘ఎ’ (A) సిరీస్కు కెప్టెన్గా నియమించారు. ప్రస్తుతం భారత క్రికెట్ ఆటగాళ్ల ఫామ్, భవిష్యత్తు ప్రణాళికలు మరియు అంతర్గత అధికార సమీకరణాల మధ్య ఒక కీలకమైన మలుపు వద్ద నిలిచింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్కు గంభీర్ మరో అవకాశం ఇస్తాడా లేదా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
