Supreme Court: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ‘స్టే’ సుప్రీంకోర్టు విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు స్టే అమలులో ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
Read Also: Telangana: ఇలా కూడా ఉంటారా?.. మనవడిని అమ్మేసిన నాయనమ్మ.. దత్తత పేరుతో డ్రామా!
తమ నియామకాన్ని పక్కన పెట్టి, కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థాన విచారణ చేపట్టింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టే విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా.. గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే, గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాల చేపట్టడం ప్రభుత్వ విధి అని ధర్మాసనం పేర్కొంది.
అనంతరం విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ప్రతివాదులుగా ఉన్న గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరలే ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం, గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకున్నా, సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.