వరిధాన్యం, బియ్యం సేకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వరిధాన్యం కొనుగోలుపై లోకసభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానం ఇచ్చారు. 2018-19 లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి 48.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించగా, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు.
2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ జరిగిందని స్పష్టం చేశారు. 2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించగా, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ చేశామని తెలిపారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఏజన్సీలు, “భారత ఆహార సంస్థ” సమన్వయంతో ( ఎఫ్.సి.ఐ) ధాన్యం సేకరణ చేస్తున్నాయని లోక్సభలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ నుంచే ఎక్కువ బియ్యం సేకరణ జరుగుందని గుర్తు చేశారు.