శ్రీపుట్టపర్తి సత్యసాయిబాబాను భక్తులు కదిలే దైవంగా చూస్తారు. ఆయన గురించి ఇప్పటి తరానికి, రాబోయే తరానికి తెలియ జేయాలనే సంకల్పంతో ‘శ్రీసత్యసాయి అవతారం’ పేరుతో సాయివేదిక్ ఫిలింస్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. విజయదశమి పర్వదినాన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. సాయిప్రకాష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా ఆయనకు 100వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని స్వామి భక్తులు డాక్టర్ దామోదర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ల భరణి క్లాప్ నివ్వగా, కె. అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ స్విచ్ఛాన్ చేశారు. ఎస్.వి. కృష్ణారెడ్డి తొలిషాట్కు దర్శకత్వం వహించారు. నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సి.హెచ్. మధన్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయగా, సాయికుమార్, సుమన్, బాబూమోహన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా పాత్రికేయులతో దర్శకుడు సాయిప్రకాష్ మాట్లాడుతూ ‘బాబాగారికి 180 దేశాలలో భక్తులు ఉన్నారు. ఆయనతో సన్నిహితంగా గడిపే అదృష్టం నాకు దక్కింది. ఈ సినిమాకు దర్శకత్వ అవకాశం నాకు రావడం కూడా ఆయన దయ. స్వామి ఎప్పుడూ అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి అని చెపుతూ ఉంటారు. ఇది అక్షరాలా నిజం. మానవ సేవయే మాధవ సేవ అనే గొప్ప విషయం ఇందులో ఇమిడి ఉంది. ఇందులో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 400 మంది నటీనటులు నటించబోతున్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తాం’ అన్నారు. పృథ్వి, అర్చన, కోటా శంకర్రావు, బాబూ మోహన్, అశోక్ కుమార్, శివపార్వతి తాము ఈ సినిమాలో భాగం అవుతున్నామని అన్నారు.