Somu Veerraju: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతలు తమ అభిప్రాయాలను చెబుతూ వస్తున్నారు.. తమ మదిలో ఉన్న సీటును బయటపెడుతున్నారు.. ఫైనల్గా నిర్ణయం మాత్రమే పార్టీ అధిష్టానానిదే అంటున్నారు.. ఇప్పుడు బీజేపీ ఏపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు వంతు వచ్చింది.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో నేను కూడాపోటీ చేస్తానని ప్రకటించారు. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడినుండే పోటీకి సిద్ధమన్న ఆయన.. నాది రాజమండ్రి.. నిర్ణయం అధిష్టానానిది అని పేర్కొన్నారు. ఇక, సంక్రాంతి పండగలోపు 32 మందితో బీజేపీ ఎన్నికల కమిటీ నియమిస్తామన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలకు వేరువేరుగా మేనేజ్మెంట్ కమిటీలు ఉంటాయన్న ఆయన.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకు సంస్థాగత కమిటీలు వేస్తాం అన్నారు.
Read Also: Hyderabad: టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ యువతిపై లైంగిక దాడి..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నవరత్నాలు కంటి తుడిపి చర్యగా అభివర్ణించారు సోము వీర్రాజు.. వైసీపీ అనాలోచిత నిర్ణయాలు తప్ప.. చేసిన అభివృద్ధి ఏమి లేదని దుయ్యబట్టారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే అర్హత ఎవరికి లేదన్నారు. ఇక, రాష్ట్రంలో మంత్రులు మాట్లాడుతున్న తీరులో ప్రభుత్వం ఉంటుందో ఊడిపోతుందో తెలియని భావన ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కేంద్రంలోని మోడీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరును వైయస్సార్ ఆరోగ్య మందిర్ కింద పేరు మార్పు చేశారని ఎద్దేవా చేశారు. తనే ఇంటింటికి వైద్యం పంపిస్తున్నానని కలరింగ్ ఇస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు సోము వీర్రాజు.