అసలే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో అల్లాడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. సబ్బుల ధరలను పెంచుతూ హిందూస్థాన్ యూనీలివర్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్ఫ్లవర్, పామాయిల్, సోయాబీన్ దిగుమతులపై ప్రభావం పడటంతో సబ్బుల తయారీ కంపెనీలకు నష్టం వాటిల్లుతోంది. ఈ మేరకు పలు సబ్బుల ధరలను 3 నుంచి 7 శాతం మేరకు హెచ్యూఎల్ పెంచింది. దీంతో సర్ఫ్ ఎక్సల్, వీల్, రిన్ వంటి డిటర్జెంట్ పౌడర్లతో పాటు డోవ్, లక్స్, పియర్స్, హమామ్, లిరిల్, రెక్సోనా వంటి ఒంటి సబ్బుల ధరలు కూడా పెరగనున్నాయి.
హెచ్యూఎల్ తాజా నిర్ణయంతో సర్ఫ్ ఎక్సల్ డిటర్జెంట్ కేజీ రూ.130 నుంచి రూ.134కు పెరిగింది. లక్స్ సోప్ (100 గ్రాములు 4) ఏకంగా 6.66 శాతం పెరిగి రూ.160కి చేరింది. పియర్స్ (75 గ్రాములు 3) సబ్బుల ధర సైతం 5.4 శాతం పెరిగి రూ.135కి చేరింది. కాగా త్వరలో ఇతర కంపెనీలు సైతం సబ్బుల ధరలు కూడా పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే బిస్కెట్ కంపెనీలు కూడా ధరలను పెంచిన సంగతి తెలిసిందే. బ్రిటానియా, పార్లె, డాబర్ ఇండియా వంటి సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచేశాయి. మ్యారిగోల్డ్, గుడ్ డే వంటి బిస్కెట్ల తయారీ సంస్థ బ్రిటానియా తమ ఉత్పత్తుల ధరలను ఏడు శాతం పెంచుతామని చెప్పింది.