Site icon NTV Telugu

Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

Dead

Dead

అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బోయకొండ అటవీ ప్రాంతంలో కుమారుడి కళ్లముందే దారుణంగా తండ్రిని హత్య చేశారు. రాత్రంతా తండ్రి శవం పక్కనే గడిపిన ఐదేళ్ల చిన్నారి.. ఉదయం అడవి నుంచి బయటకు వచ్చి జరిగిన విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తి తన ఐదేళ్ల కుమారుడు సందీప్‌తో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. ఈ సమయంలో నరసింహులు అనే వ్యక్తి.. మరో ముగ్గురితో కలిసి గాంధీపై దాడి చేశాడు.

చిన్నారి సందీప్ కళ్లముందే ఇనుప రాడ్లు, కత్తులతో దారుణంగా దాడి చేసి గాంధీని హత్య చేశారు. తండ్రి కళ్లముందే చనిపోవడం చూసిన చిన్నారి భయంతో అక్కడే ఉండిపోయాడు. రాత్రంతా అటవీ ప్రాంతంలో తండ్రి మృతదేహం పక్కనే గడిపాడు. ఉదయం ధైర్యం తెచ్చుకున్న సందీప్.. సుమారు ఒకటిన్నర కిలోమీటరు నడుచుకుంటూ సమీప అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ టీచర్‌కు జరిగిన ఘటనను వివరించాడు. విషయం తెలుసుకున్న అంగన్వాడీ టీచర్ వెంటనే సందీప్‌తో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా.. గాంధీ మృతదేహం కనిపించింది. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: Mumbai Indians Mistake: ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?.. భారీ మూల్యం చెల్లించిందిగా?

విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. శవాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మృతుడి భార్య రాఫాతి పరారీలో ఉంది. నిందితుడు నరసింహులు, అతని సహచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐదేళ్ల చిన్నారి కళ్లముందే తండ్రిని హత్య చేయడం, రాత్రంతా శవం పక్కనే గడపాల్సిన పరిస్థితి ఈ ఘటన ఎంత దారుణమో చెబుతోంది.

Exit mobile version