Sanjay Raut: ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)లో మరోసారి తిరుగుబాటు చెలరేగింది. 9 మంది ఎంపీల్లో ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే శివసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సమక్షంలోనే తిరుగుబాటు ఎంపీలపై బూతుల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా గురువారం కూడా సంజయ్ రౌత్ మరోసారి ఎంపీలపై దూషణలకు దిగారు. అంతటితో ఆగకుండా ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టుకు ముడిపెట్టారు.
న్యూఢిల్లీలో మీడియాతో తిరుగుబాటు ఎంపీలకు కల్పించిన భద్రత గురించి మాట్లాడుతూ.. వాళ్లు పిరికి వెధవలు అని అన్నారు. ఇప్పుడు ఆ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో స్వేచ్చగా తిరగాలని సవాల్ విసిరారు. ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీంకోర్టు అతిపెద్ద దోషి అని నిందించారు. సుప్రీంకోర్టు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదని అన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి 9 మంది ఎంపీల్లో కేవలం ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ఆరుగురు గైర్హాజరయ్యారు. విప్ ఉల్లంఘించాలరని వీరిపై చర్యలు తీసుకునేందుకు శివసేన యూబీటీ సిద్ధమవుతోంది. బీజేపీ దేశ రాజకీయాలను, ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిందని, దీనికి వారు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సంజయ్ రౌత్ హెచ్చరించారు.

