Sajjala Ramakrishna Reddy: విజయవాడలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడి పక్కా ప్లాన్తో చేసిందే.. అది ఆకతాయిల చర్య కాదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ప్రచార రథాలను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీ కోసం పని చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల్లో సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముందుకొచ్చారు.. మన రాష్ట్రంలో మళ్లీ సీఎం వైఎస్ జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. ఇక, సీఎం జగన్ పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే.. ఇది ఆకతాయిల చర్య కాదని పేర్కొన్నారు. సీఎం జగన్పై దాగి ఘటన మీద టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాటలు అర్థరహితం అని మండిపడ్డారు. ఈ ఘటన వెనుకనున్నవారు బయటకు రావాలి.. కానీ, వాళ్లను ఇరికించాల్సిన అవసరం మాకేముంది? అని ప్రశ్నించారు. బోండా ఉమానా, ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? విచారణలో తేలుతుందన్నారు. తప్పు చేసినోడు నన్ను ఇరికించారాని మాట్లాడితే చెల్లుతుందా..? అని నిలదీశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కాగా, సీఎం వైఎస్ జగన్ పై దాడి కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ రోజు ఈ కేసులో ఏ-1గా భావిస్తోన్న వ్యక్తిని కోర్టులో హాజరుపర్చిన విషయం విదితమే.