ఎన్నికల పై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తున్నామన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి 80 శాతం ప్రజలకు చేరిందని, కూటమికి అజెండా లేదన్నారు. అధికారం కోసమే పొత్తులతో టీడీపీ కూటమి నానా జాతి సమితి ఒకవైపు అని, మంచి చేసిన మేము ఒక వైపు అని ఆయన వ్యాఖ్యానించారు. నానాజాతి సమితి అంతా కలిసి అధికారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. 2014 -19 అరాచక ప్రభుత్వం కావాలా అని, 2019-24 మధ్య ఉన్న ప్రజా ప్రభుత్వం కావాలో ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. పెనమలూరు నుంచి జోగి రమేష్ గెలుపు ఇప్పటికే ఫిక్స్ అయ్యిందని, పెనమలూరు నుంచి మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే టీడీపీలోకి ఫిరాయించారన్నారు. గతం కంటే ఎక్కువ మెజారిటీతో పెనమలూరులో విజయం సాధిస్తామన్నారు సజ్జల.
అంతేకాకుండా.. ‘మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో అన్ని స్థానాల్లో గెలుస్తాం. పవన్ కళ్యాణ్ ఒక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్. ఆలోచన లేని అవగాహన లేని రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పుట్టాడు, పెరిగాడు…పార్టీ పెట్టాడు.రాజకీయాల్లోకి వచ్చాడు. చంద్రబాబు బటన్ నొక్కితే పవన్ కళ్యాణ్ కదులుతాడు…ఆగుతాడు. చంద్రబాబుతోనే పవన్ రాజకీయ అంకం ముగుస్తుంది. చిరంజీవి కూటమికి ఓటు వేయమని చెప్పడం మాకు మంచిది. చిరంజీవి కాదు కదా ఇంక ఎంత మంది కూటమికి మద్దతు ఇచ్చినా మాకు నష్టం లేదు. ఏపి రాజకీయ తెర మీద జగన్ ఒక్కడే ఉన్నారు. తోడేళ్ళు గుంట నక్కలు,ముళ్లపందులు అన్ని ఏకమై అటువైపు ఉన్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి 25వ తేదిన నామినేషన్ వేస్తారు. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రెండు రోజుల్లో మ్యానిఫెస్టో విడుదల చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.