నేటి నుంచి ‘రైతు మహోత్సవం’ వేడుకలు ఆరంభం కానున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏప్రిల్ 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. రైతు మహోత్సవం నేపథ్యంలో నేడు జిల్లాలో ముగ్గురు మంత్రులు, పీసీసీ చీఫ్ పర్యటించనున్నారు. రాష్ట్ర రైతు మహోత్సవం మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరంబించనున్నారు.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతులకు అందే సేవలను మరింత చేరువ చేసేందుకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు మహోత్సవం నిర్వహిస్తోంది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అభ్యుదయ రైతులు హాజరుకానున్నారు. రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థలు తమ అనుభవాలు పంచుకుకొనున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా మార్కెట్లోకి వచ్చే యంత్రాలు, పరికరాలు, నూతన వంగడాలు, మేలు రకం విత్తనాలను వ్యవసాయ అనుబంధ విభాగాలు, విశ్వవిద్యాలయాలు ప్రదర్శించనున్నాయి. పంట సాగుకు దోహదపడే డ్రోన్లను ఇక్కడ చూడొచ్చు. డెయిరీ, పట్టు పరిశ్రమ, చేపల పెంపకంలో వచ్చే లాభాల గురించి అధికారులు రైతులకు వివరించనున్నారు.
రైతు మహోత్సవం కోసం వ్యవసాయ శాఖ 150 స్టాళ్లను ఏర్పాటు చేసింది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మూడు రోజులు వసతులు, సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులతో పాటు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచనున్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖల శాస్త్రవేత్తలు, నిపుణులు సహా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు నూతన వ్యవసాయ పద్ధతులపై వర్క్ షాపు నిర్వహిస్తారు.