Russia Ukraine War: ఉక్రెయిన్పై యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సరిహద్దులో భద్రతను పెంచాలని ఆదేశించారు. మాస్కో నియంత్రణలో ఉన్న ఉక్రేనియన్ ప్రాంతాలలో రష్యా సైన్యం, పౌరుల భద్రతను బలోపేతం చేయడం పుతిన్ ఆదేశం వెనుక ఉద్దేశం. బోర్డర్ డిఫెన్స్ డే సెలవుదినం సందర్భంగా రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB)కి చెందిన బోర్డర్ సర్వీస్కు అభినందన సందేశంలో పుతిన్ మాట్లాడారు. యుద్ధ జరుగుతున్న ప్రదేశంలో చుట్టూ ఉన్న సమీప ప్రాంతాలను దృఢంగా కవర్ చేయాలని ఆదేశించారు. గత కొన్ని వారాలుగా రష్యా లోపల దాడులు పెరుగుతున్న తరుణంలో సరిహద్దుల్లో భద్రతను పెంచాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రష్యా సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు పెరిగాయి. మాస్కోకు వాయువ్యంగా ఉన్న చమురు పైప్లైన్పై కూడా శనివారం దాడి జరిగింది.
Read Also:New Parliament Inauguration: సెంగోల్ని ప్రతిష్టించిన ప్రధాని.. పార్లమెంట్లో సర్వ మత ప్రార్థనలు..
శనివారం రష్యాలోని బెల్గోరోడ్లో ఉక్రెయిన్ జరిపిన దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇది ఉక్రెయిన్ సైన్యం లక్ష్యంగా ఉన్న ప్రాంతం. రష్యా రక్షణ, సైనిక సామర్థ్యంపై కూడా ఈ దాడి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. కుర్స్క్, బెల్గోరోడ్ ప్రాంతం మొదటి నుండి ఉక్రేనియన్ సైన్యానికి లక్ష్యంగా ఉంది. ఈ దాడిలో విద్యుత్, రైలు ఇతర సైనిక మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే, రష్యా లోపల, ఉక్రెయిన్లోని రష్యా నియంత్రణలో ఉన్న భూభాగంపై దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఎప్పుడూ ప్రకటించలేదు. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలను నాశనం చేయడం తన గ్రౌండ్ అటాక్ ప్లానింగ్లో భాగమని చెప్పింది.
Read Also:New Parliament Building : కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ దృశ్యాలు
15 నెలల సుదీర్ఘ యుద్ధంలో రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రతీకార దాడులను వేగవంతం చేస్తామని ఉక్రెయిన్ శనివారం సంకేతాలు ఇచ్చింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య గత ఏడాది ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైంది, అప్పటి నుంచి యుద్ధం నిరంతరం కొనసాగుతోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఉక్రెయిన్లోని అనేక నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.