కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు రెండు సార్లు అత్యధిక మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించారు.. మీరు పెంచిన మొక్క వృక్షమై పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండే స్థాయికి చేరింది అని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట నుంచి ఒకడు, సిరిసిల్ల నుంచి ఇంకొకడు గజ్వేల్ నుంచి మరొకడు కొడంగల్ కు గొడ్డలి తీసుకుని బయలుదేరారు.. తండ్రి, కొడుకులు, అల్లుడు, వాళ్ల చెంచాలు ఈ చెట్టును అడ్డు తొలగించుకోవాలని కుట్ర చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. వాళ్ల మోచేతి నీళ్లు తాగిన వాళ్లు ఈ కుట్రలో భాగస్వాములై సహకరిస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి అన్నారు.
మీరు పెంచిన చెట్టును ఎవడో గొడ్డళ్లు తీసుకుని నరకాలని చూస్తుంటే మీకు పౌరుషం లేదా? అని రేవంత్ రెడ్డి అన్నారు. దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్న కేసీఆర్ ఐదేళ్లలో కొడంగల్ కు చేసిందేంటి.. బస్టాండు , సబ్ స్టేషన్, కాలేజీ, ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టించింది నేను కాదా?.. ఇంటికొచ్చి ఏదైనా అడిగితే.. ఎవరైనా సాయం కోరి వస్తే ఏనాడైనా కాదన్ననా?.. ఏరోజైనా ఎవరి దగ్గర నుంచైనా ఒక్క రూపాయి అడిగానా? అని ఆయన తెలిపారు. గౌడ సోదరులకు, ముదిరాజులకు, దళిత బిడ్డల అభివృద్ధికి నేను కృషి చేసింది నిజం కాదా?.. మైనారిటీలకు కమ్యూనిటీ భవనం కట్టించింది నేను కాదా?.. మార్కెట్ యార్డు కట్టించింది, అభివృద్ధి చేయించింది నేను నేను కాదా? అని రేవంత్ రెడ్డి చెప్పారు.
నియోజకవర్గానికి ట్రాన్స్ఫార్మర్స్ తెచ్చి అగ్గిపెట్టెల్లా పంచింది నేను కాదా? అని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు నేను ఎమ్మెల్యేగా ఉండగా ఇవన్నీ చేసింది నిజం కాదా?.. కానీ కేసీఆర్ మాటలు నమ్మి గత ఎన్నికల్లో మీరు బీఆరెస్ కు ఓటు వేసి గెలిపించారు.. పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చారు? అని ఆయన అడిగారు. కృష్ణా జలాలు వచ్చాయా? పాలమూరు ఎత్తిపోతల పూర్తయిందా?.. రైల్వే లైన్ తెచ్చిండా? పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా?.. ఇవేవీ చేయకపోగా కొడంగల్ ను రెండు ముక్కలు చేసి కుక్కలు చించిన విస్తరి చేశారు.. అలాంటి కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలి.. కొడంగల్ ఆత్మగౌరవాన్ని ఒక ఫుల్ బాటిల్ కో, ఐదు వేలకో తాకట్టు పెట్టకండి.. కొడంగల్ ప్రజలారా.. ఆలోచించండి.. మన బతుకులు మారాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ గెలవాలి.. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన చేసిందే కాంగ్రెస్.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ది.. ధరణి రద్దు చేస్తే రైతు బంధు రాదని కేసీఆర్ చెప్తుండు.. కానీ రైతులకు నేను స్పష్టంగా చెబుతున్నా.. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఏటా ప్రతీ ఎకరాకు రూ.15వేలు ఇచ్చే బాధ్యత మాది అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.