టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఎన్టీవీ క్వశ్చన్ అవర్ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ను ఇంకెవరూ కాపాడలేరన్నారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. చత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. సీఎం మారారా.? కాంగ్రెస్లో ఎవరైనా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చు. బీఆర్ఎస్లో సీఎం అవుతానని చెప్పే ధైర్యం హరీష్రావుకు ఉందా.?అలా చెబితే హరీష్ రావు ఉదయానికల్లా జైల్లో ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్లో ఉద్యమకారులకు సీట్లిచ్చాం. వేల కోట్ల ఆస్తులున్నవారికి రాజ్యసభ సీట్లిచ్చారు. బీఆర్ఎస్లో ఉంటేనే తెలంగాణ ఉద్యమకారుడా..? తెలంగాణ ద్రోహులు అనడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. నేను ఏ రోజు తెలంగాణను వద్దని చెప్పలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం సీట్లిచ్చాం. పార్టీ ఫిరాయించినవారికి, కాంట్రాక్టర్లకు కేసీఆర్ పదవులిచ్చారు. వేల కోట్ల ఆస్తులున్నవారికి రాజ్యసభ సీట్లిచ్చారు. శ్రీకాంతచారి తల్లికి ఓడిపోయే సీటిచ్చారు. సీఎం కేసీఆర్ అధికారం కుటుంబం కోసమే వాడుతున్నారు. కాంగ్రెస్కు అధికారం వచ్చినా సోనియా కుటుంబం పదవులు తీసుకోలేదు. మొన్నటివరకు కాంగ్రెస్కు అభ్యర్థులు లేరని అన్నారు. గాంధీభవన్లో ఈటలు తోలుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ గెలుస్తుందన్న భయంతోనే ఈ ఆరోపణలు. ధరణి లోపభూయిష్టమైన వ్యవస్థ. కేసీఆర్ కుటుంబమే పెద్ద దళారుల కుటుంబం. అంతర్జాతీయ నేరగాళ్లు ఉండే దేశాల నుంచి ధరణి పనిచేస్తోంది. రెవెన్యూ రికార్డులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రైవేట్ వ్యక్తుల చేతికి రికార్డులిచ్చే అధికారం కేసీఆర్కు ఎవరిచ్చారు. భూ భారతి కింద డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేపట్టిందే గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్. ధరణి వచ్చాక.. హైదరాబాద్లో ఉంటున్న కొందరు వందల ఎకరాలకు ఆసాములయ్యారు. ఎప్పుడో ఊళ్లలో భూములు అమ్ముకున్నవాళ్ల పేర్లు.. ఇప్పుడు రికార్డుల్లోకి ఎలా వచ్చాయి..? ‘ అని రేవంత్ రెడ్డి అన్నారు.