అమిత్ షా టాక్స్, అంబానీ టాక్స్ విన్నామని, ఆర్, ఆర్ టాక్స్ వినలేదన్నారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ హక్కు తో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ లోకి వచ్చారని, ఢిల్లీ పోలీసులకు మాతెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు రేణుకా చౌదరి. మర్యాదగా కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళని విడిచిపెట్టండని, ప్రజ్వల్ రెవన్న ను ఇంతకీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. పార్లమెంట్ లో మహిళల పై దుర్భాషలాడిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ఆమె విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ పై మోడీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు రేణుకా చౌదరి. ఇలాంటి సంస్కారం లేని మోడీ మహిళలపై ప్రేమ కురిపిస్తుండని, కాంగ్రెస్ సోషల్ మీడియా పై కక్ష కట్టారన్నారు. రైతుల పైన జీవు తో తొక్కించి చంపిన బ్రిజ్ భూషణ్ కొడుక్కి పార్లమెంట్ టికెట్ ఇచ్చారని,
అలాంటి వ్యక్తికి మీరు అండగా ఉన్నారా మోడీ అని ఆమె అన్నారు. మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ దేశంలో హిందువులకు ఉన్న హక్కులు మిగతా అన్ని వర్గాలకు ఉన్నాయని, నరేంద్ర మోడీ కేవలం హిందువలకు మాత్రమే ప్రధాన మంత్రా? ముస్లింలకు ప్రధాన మంత్రి కాదా? అని నిలదీశారు. మధించిన ఏనుగు మాదిరిగా వ్యవస్థ లన్నింటిని తొక్కివేస్తూంటే చూసి సిగ్గుపడుతున్నామన్నారు. ముస్లిం దేశాల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని, హిందూ ధర్మాన్ని గౌరవించి కోట్లాది రూపాయలు వెచ్చించి తమ దేశాలలో హిందూ దేవాలయాలను నిర్మించి ప్రధాని మోడీని స్వాగతిస్తే ఆయన మాత్రం మీ దేశంలో ముస్లింలను కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బీజేపీ చర్యలను చూసి ఆ దేశాల్లో ఉండే హిందువులు భయాందోళనలతో గడుపుతున్నారన్నారు. మొదటి ప్రధాని నెహ్రూ దూరదృష్టితో ఆలోచించి ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి మన వారు విదేశాల్లో సత్తా చాటేలా చేశారన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యల వల్ల విదేశాల్లో ఉన్న మనవారిపై అక్కడి వారు తిరగబడితే వాళ్లందరు ఏమైపోతారని కూడా ఆలోచించరా? అని ఫైర్ అయ్యారు.