CM Chandrababu: రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో సౌరవిద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పునరుద్ఫాదక విద్యుత్ ను తయారు చేసుకునేందుకు వీలుందని ఆయన సూచించారు. దీనికి అనుగుణంగా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అలాగే ఉత్పాదనకు అనుగుణంగా భవిష్యత్తులో ఆ విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేలా ట్రాన్స్ మిషన్ లైన్లను కూడా సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎస్ఐపీబీ సమావేశం రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలియచేసింది. ఈ సమావేశానికి మంత్రులు నారాలోకేష్, కె.అచ్చెన్నాయుడు, పి.నారాయణ, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ , సీఎస్ జి.సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్ అనుమానమే!
పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రూ. 39,436.84 కోట్ల విలువైన ప్రతిపాదనలకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు ఆమోదం తెలియచేసింది. 31 ప్రాజెక్టుల ద్వారా 1,11,278 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉత్పత్తి అయిన విద్యుత్ ను స్టేట్ గ్రిడ్, సెంట్రల్ గ్రిడ్ కు కనెక్టు చేసేలా చూడాలని మంత్రి లోకేష్ సూచనలు చేశారు.
దీనిపై స్పందించిన సీఎం సమీప భవిష్యత్తులో ఉత్పత్తి అయిన విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసేలా ట్రాన్స్ మిషన్ లైన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాజస్థాన్ లో సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉందని.. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో కంజ్యూమర్ ప్రాడెక్ట్స్ తయారీలో ఏపీ కీలకంగా మారాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీసిటీ, కొప్పర్తి, అనంతపూర్ లలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా పెట్టుబడుల్ని ఆకర్షించాలన్నారు. రాష్ట్రంలో జీసీసీల ఏర్పాటుపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏపీ జీసీసీలకు కేంద్రంగా మారాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా కల్చర్ రంగాల్లో వస్తున్న వ్యర్ధాలను సద్వినియోగం చేసుకునేలా ప్రాజెక్టులను ఆహ్వానించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ రంగాల్లో కాలుష్య కారకాలు లేకుండా ఇథనాల్ తరహా బై ప్రాడెక్టులు వచ్చేలా చూడాలని దీనికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేయాలన్నారు. దీనిపై కేంద్రం నుంచి సహకారం కూడా తీసుకోవాలని సూచించారు.
The Paradise: ప్యారడైజ్ రిలీజ్ డేట్ మారుతోందా?
రాష్ట్రంలో వివిధ పెట్టుబడి ప్రతిపాదనతో వస్తున్న పరిశ్రమల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవటం పై కూడా దృష్టి సారించాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోనేలా ఈ సేఫ్టీ స్టాండర్డ్స్ ను నిర్దేశించాలన్నారు. ఫార్మా, స్టీల్, గ్రీన్ ఎనర్జీ, బీఈఎస్ లాంటి ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేకంగా ఓ ఎస్ఓపీని సిద్ధం చేయాలని సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనలకు అనుగుణంగా ఈ భద్రతా ప్రమాణాలను పారిశ్రామిక యూనిట్లు కలిగి ఉండాలని తేల్చి చెప్పారు.
ఇటీవల రాష్ట్రంలోని బాణా సంచా తయారీ యూనిట్లలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాణా సంచా తయారీ యూనిట్లు, మిల్క్ డెయిరీలు లాంటి అంశాల్లో ఉల్లంఘనలు లేకుండా ప్రామాణిక విధానాలు జారీ చేయాలని సూచించారు. నిర్దేశిత ప్రమాణాలను పాటించే విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతి క్వాంటం టవర్స్ ను త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. భూములు కేటాయించిన పర్యాటక ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని.. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు లేదన్నారు.
రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం పొందిన ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభం అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. వీటితో పాటు భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా సాకారమయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రత్యేకించి ఆయా ప్రభుత్వ శాఖలు వీటిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఆయా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. భారీ ప్రాజెక్టులపై ప్రతీ ఎస్ఐపీబీ సమావేశంలోనూ సమీక్షిద్దామని సీఎం స్పష్టం చేశారు.
మరోవైపు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉత్పత్తి సామర్ధ్యం పెరగాలన్నారు. పామాయిల్, కోకో లాంటి ఉద్యాన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా చూడాలని సీఎం సూచించారు. ఉద్యాన ఉత్పత్తులు 200 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 400 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగాలని అన్నారు. దీనికి తగినట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెరిగితే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. ప్రాడెక్టు పర్ఫెక్షన్ పై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన వివరాలను వెబ్ సైట్ లో పొందుపరచాలని సీఎం సూచించారు. తాజాగా 16వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదించిన పెట్టుబడులతో కలిపి రాష్ట్రంలో గడచిన 22 నెలల్లో ఇప్పటి వరకు 264 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రూ.9.36 లక్షల కోట్ల పెట్టుబడులు, 9.60 లక్షల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు ద్వారా 538 ఎంఓయూలకు గానూ రూ.11.38 లక్షల పెట్టుబడులు, 13.95 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా 802 ప్రాజెక్టుల ద్వారా రూ.20.74 లక్షల కోట్ల పెట్టుబడులు, 23.55 లక్షల ఉద్యోగాల కల్పన జరుగనుంది.