Rains: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండు మూడు రోజుల కిందటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ఇప్పుడు ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 10 నుంచి వాతావరణం చల్లబడటం ప్రారంభించింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. సగటున 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా ఉన్నాయి. తెలంగాణపై ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురవచ్చు. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
Read Also: KCR: లోక్సభ ఎన్నికలపై ఫోకస్.. నేడు చేవెళ్ల నుంచి ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్తో సహా పలు జిల్లాలకు ఆరెంజ్తో పాటు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. అటు.. దేశవ్యాప్తంగా కూడా ఎండలు కాస్తా తగ్గాయి. కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. తమిళనాడులో వరుణుడు కరుణించాడు. మండుతున్న ఎండల నుంచి అక్కడి ప్రజలకు ఉపశమనం కలిగించాడు. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. రాజధాని చెన్నైలో కూడా రెండురోజులపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలను దాటకపోవచ్చని అంచనా వేసింది.