తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీల నేతలు ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు హామీలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ రోజు ఆర్మూర్ రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దొరల తెలంగాణ కు, ప్రజల తెలంగాణకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ప్రత్యేక తెలంగాణలో ప్రజల గొంతు వినిపిస్తుందనుకున్నామని, తెలంగాణలో ప్రజల రాజ్యం నడవాలని సోనియమ్మ తెలంగాణ ఇచ్చారన్నారు. సోనియమ్మ ఆకాంక్ష దొరల తెలంగాణ కాదు… ప్రజల తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయింది. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది. కేసీఆర్ పదేళ్లుగా ప్రజల సొమ్ము దోచుకున్నారు.. కేసీఆర్ మీ నుంచి దోచుకున్న సొమ్మునంతా మీకు అందేలా చూస్తా.. కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగాయని టీ కొట్టులో వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. రూ.4వేలు పెన్షన్ అందిస్తాం. మహిళల కోసం మహాలక్ష్మి పథకం తెరసుకొచ్చాము. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందించనున్నాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. రైతుభరోసా ద్వారా ఏడాదికి ఎకరాకు రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు రూ.12వేలు ఇవ్వబోతున్నాం. పసుపు రైతులకు ప్రధాని హామీ ఇచ్చి మోసం చేశారు. ఛత్తీస్ గడ్ లో ఇచ్చిన మాట ప్రకారం వారి ధాన్యాన్నీ క్వింటా రూ.2500 లకు కొంటున్నాం. పసుపు రైతులకు క్వింటాకు రూ.12 వేలు నుంచి 15వేలు ధర కల్పించనున్నాం. నేను అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతాం.. ఇందిరమ్మ మీ భూముల కోసం కొట్లాడిన సంగతి గుర్తు చేస్తున్నా. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మా కుటుంబానికి అండగా ఉన్నారు… తెలంగాణతో నా అనుబంధం ఇప్పటిది కాదు.. ఇందిరమ్మ నాటి నుంచి ఈ బంధం కొనసాగుతోంది.. బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం ఒక్కటే.. బీఆర్ఎస్ కారు టైర్ లో వారికి తెలియకుండానే గాలి పోయింది.. కాంగ్రెస్ లో చేరేందుకు బీజేపీ నుంచి క్యూ కడుతున్నారు. బీజేపీతో పోరాడిన నాపై 24 కేసులు పెట్టారు… మరి కేసీఆర్ పై ఎన్ని కేసులున్నాయి. విపక్షాలపై కేసులు పెట్టె ప్రధాని మోదీ.. కేసీఆర్ పై ఎందుకు పెట్టరు? పార్లమెంట్ లో ప్రతీ బిల్లుకు బీజేపీకి బీఆరెస్ మద్దతు పలికింది. బలం లేకపోయినా ఎంఐఎం అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ ను ఓడించేందుకే ఎంఐఎం పోటీ.. ఎంఐఎం ఎక్కడెక్కడ పోటీ చేయాలో… బీజేపీ లిస్టు తయారు చేసి ఇస్తోంది.. రాష్ట్రంలో బీఆరెస్ ను.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లో బీజేపీ ని ఓడించి తీరతాం.. బీజేపీ, ఎంఐఎం కు ఓటు వేస్తే అది బీఆరెస్ కు వేసినట్లే.. తెలంగాణలో రాబోయేది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం.’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.