Solar energy projects: రాజస్తాన్లో ఎన్టీపీసీకి చెందిన 300 మెగావాట్ల నోఖ్రా సోలార్ ప్రాజెక్టును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు. బికనీర్ జిల్లాలో 1,550 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది. పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ను తెలంగాణ రాష్ట్రానికి అందించడానికి 1,803 కోట్ల రూపాయల పెట్టుబడితో సీపీఎస్యూ పథకం (ఫేజ్– ఐఐ) కింద ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది. 13 లక్షల పైచిలుకు సోలార్ పీవీ మాడ్యూల్స్ ఉపయోగించారు. ప్రాజెక్టు పూర్తైతే ప్రతి సంవత్సరం 730 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఎన్టీపీసీ పేర్కొనింది.
Read Also: Bitcoin : బిట్కాయిన్ రెండేళ్ల గరిష్టానికి పెరగడానికి వెనుక కారణం ఏమిటి?
కాగా, ఈ ప్రాజెక్ట్ 1.3 లక్షలకు పైగా గృహాల్లో వెలుగులు నింపుతుందని ఎన్టీపీసీ తెలిపింది. అలాగే, ప్రతి సంవత్సరం 6 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని చెప్పుకొచ్చింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరులతో 3.4 గిగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ను ఉత్పత్తి చేస్తుందని వెల్లడించింది. 26 గిగావాట్ల సామర్థ్యం గల వివిధ ప్రాజెక్టులు పలు నిర్మాణ దశల్లో ఉన్నాయని ఎన్టీపీసీ వెల్లడించింది.