మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని మోడీ ఈరోజు ఇజ్రాయెల్ పర్యటనకు బయల్దేరి వెళ్తున్నారు. నేటి నుంచి రెండు రోజులు ఇజ్రాయెల్లో మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఇక పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీకి అరుదైన గౌరవంగా చెప్పొచ్చు. 2015లో రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఇజ్రాయెల్లో పర్యటించి పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. మళ్లీ ఇప్పుడు ఆ అవకాశం మోడీకి దక్కింది. అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ను కూడా మోడీ కలవనున్నారు.
రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలపడే విధంగా ఒప్పందాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్, వాణిజ్య మంత్రి పియూస్ గోయల్ కూడా ఇటీవలే ఇజ్రాయెల్లో పర్యటించి వచ్చారు. అలాగే ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం కూడా ఇటీవల ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో కూడా పాల్గొంది. తాజా పర్యటనతో మరింత బలపడనున్నాయి.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ వ్యక్తిగత స్నేహితుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. ‘రాడికల్’ విరోధులను ఎదుర్కోవడానికి కొత్త కూటమిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ఇజ్రాయెల్ పర్యటన కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఆదివారం ప్రధాని మోడీ ఎక్స్లో పేర్కొన్నారు. ‘‘ఇజ్రాయెల్తో విశ్వాసం, ఆవిష్కరణ, శాంతి, పురోగతి పట్ల ఉమ్మడి నిబద్ధతపై నిర్మించబడిన శాశ్వత స్నేహాన్ని భారతదేశం ఎంతో విలువైనదిగా భావిస్తుంది.’’ అని పేర్కొన్నారు.