Pakistan Demands Nobel Peace Prize: అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన నేపథ్యంలో, పాకిస్థాన్లో ఒక వింత డిమాండ్ ముందుకొచ్చింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, సైన్యాధిపతి మునీర్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అక్కడి మీడియా వర్గాలు, కొంతమంది ప్యానలిస్టులు డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్పై 15 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి పాకిస్థాన్ నాయకత్వం చేసిన విజ్ఞప్తి కూడా కారణమని ఆయన పేర్కొనడం విశేషం. చైనా మధ్యవర్తిత్వంతో ఇరాన్ చర్చలకు ముందుకు వచ్చిందని కూడా ఆయన తెలిపారు.
Read Also: Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం
ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ మీడియా సంస్థలు, ముఖ్యంగా ARY వంటి ఛానెళ్లలో జరిగిన చర్చల్లో షాబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ల పాత్రను ప్రశంసించారు. కాల్పుల విరమణను పాకిస్థాన్ దౌత్య విజయంగా అభివర్ణిస్తూ, వీరికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్యానలిస్టులు అభిప్రాయపడ్డారు. ఒక చర్చా కార్యక్రమంలో ప్యానలిస్ట్ మాట్లాడుతూ, “ప్రపంచంలో నోబెల్ శాంతి బహుమతికి అర్హులైన నాయకులు ఎవ్వరైనా ఉంటే, వారు షాబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ మాత్రమే” అని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలు వీరిని నామినేట్ చేయాలని కూడా పిలుపునిచ్చారు.
అయితే, కాల్పుల విరమణ ఇంకా అనిశ్చితిలోనే ఉన్న విషయం విదితమే.. కాల్పుల విరమణ ప్రకటించిన మరుసటి రోజే తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మరో ఆసక్తికర అంశంగా మారింది. ఇక, అమెరికా–ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలపైనా అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్లో వినిపిస్తున్న ఈ నోబెల్ డిమాండ్ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. శాంతి చర్చలను ఇరాన్.. లెబనాన్తో ముడి పెడుతుండగా.. అసలు ఈ ఒప్పందానికి.. దానికి సంబంధం లేదని అమెరికా వాధిస్తోంది.. మరోవైపు, ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది.. ఈ తరుణంలో.. పాకిస్థానీల డిమాండ్.. ఆ దేశాన్ని నవ్వులపాలు చేసేదిలా తయారైంది..