OTR: ఆ ఉమ్మడి జిల్లాలో PAC సమావేశం సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో విబేధాలు మళ్ళీ బయటపడ్డాయా..? పీసీసీ చీఫ్ వచ్చినా సరే… మా రాజకీయాలు మావే, మేం మారే ప్రసక్తే లేదని అంటున్న ఆ నేతలెవరు..? కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయాల్సిన వాళ్ళు కుస్తీకి దిగడానికి కారణం ఏంటి..? ఏ జిల్లాలో ఉంది పరిస్థితి..? ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ PAC సమావేశం మెదక్లో జరిగింది. మొత్తం 10 నియోజకవర్గాల నేతలు మెదక్ కే రావాలని PCC పిలుపునివ్వడంతో అందరూ అదే పని చేశారు. PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం, కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వడం, రాజకీయ వ్యూహాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అందరూ కలిసికట్టుగా పని చేయాలంటూ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు సూచించారు పీసీసీ ప్రెసిడెంట్. అయితే… పార్టీ పెద్దలు వచ్చిన ఇంతటి ముఖ్యమైన మీటింగ్కు సిద్దిపేట జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్ష రెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధుతో పాటు కొన్ని నియోజకవర్గాల కీలక నేతలు డుమ్మా కొట్టారు.
దీంతో… ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డట్టయింది. వ్యక్తిగత వైరాలు పక్కనపెట్టి పార్టీ సమావేశానికి రావాల్సిన నేతలు ముఖం చాటేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆంక్ష రెడ్డిని నియమించడంపై సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. PAC సమావేశానికి అసంతృప్తి నేతలంతా రావడంతో… తాను కూడా అటెండ్ అయితే… గొడవ జరిగే అవకాశం ఉందన్న కారణంతో ఆమె రాలేదని సమాచారం. ఇక గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య గత కొన్నేళ్లుగా వార్ నడుస్తోంది. గజ్వేల్లో తనకంటూ ఓ వర్గాన్ని మైనంపల్లి ఏర్పాటు చేసుకోవడంపై నర్సారెడ్డి గుర్రుగా ఉన్నారు. దీంతో… ఇక్కడ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గ ఇంచార్జ్ హోదాలో PAC సమావేశానికి నర్సారెడ్డి హాజరుకావాల్సి ఉంది. కానీ ఈ సమావేశం వేరే చోట జరిగితే ఆయన వెళ్ళేవారట. మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ వుండటం…PAC సమావేశం మెదక్ లో జరగడంతోనే అటెండ్ కాలేదని తెలిసింది. అంతేకాదు… తన అనుచరులను కూడా ఈ సమావేశానికి వెళ్ళొద్దని చెప్పారట. ఇక మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్, పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన నేత నీలం మధు కూడా ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. నీలం మధు సైతం పార్టీపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని గెలుచుకునే అవకాశం ఉన్నా… పార్టీ పెద్దలు సహకరించలేదని అందుకే తన సతీమణి కవిత మున్సిపల్ ఛైర్పర్సన్ అయ్యే అవకాశాన్ని పొగుట్టుకున్నారన్న ఆవేదనలో ఉన్నారట ఆయన. అలాగే బీసీ ముదిరాజ్ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉండటంతో తనకి నామినేటెడ్ పోస్టు ఇస్తారని ఉహించుకున్నారట నీలం. అవేవీ జరక్కపోవడం పార్టీపై అసమ్మతితో ఉన్నట్టు సమాచారం. అందుకే PAC మీటింగ్కు నీలం మధు హాజరు కాలేదన్న ప్రచారం జరుగుతోంది. ఇక సిద్దిపేట నియోవర్గానికి చెందిన మరి కొందరు ముఖ్య నేతలు, జహీరాబాద్ నుంచి మరి కొందరు ముఖ్యులు కూడా అటెండ్ అవకపోవడంతో… పార్టీ తీరు ఎప్పటికీ ఇలాగే ఉంటుందా అంటూ చర్చించుకుంటున్నారు కార్యకర్తలు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో పార్టీ వీక్గా ఉందని.. బలోపేతం చేయాల్సింది పోయి ఈ వర్గపోరు ఏంటని పీసీసీ కూడా ఆగ్రహం చేసినట్టు తెలిసింది. ఇప్పటికైనా నేతలు పంతం వీడి పార్టీ కోసం పని చేయాలని పీసీసీ అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చారట. ఇప్పటికైనా తీరు మారుతుందో లేదో చూడాలి మరి.

