Gun Powder Blast: ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చినకామన పూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గన్ పౌడర్ పేలి ఓ కూలీ మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గన్ పౌడర్ (తుపాకీ మందు) పేలి చేపల చెరువుల వద్ద పని చేసే కూలీలిద్దరు తీవ్రంగా గాయపడగా… వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చినకామన పూడి గ్రామంలోని ఆళ్ల వీరాంజనేయులు చేపల చెరువుపై అస్సాంకు చెందిన బికాస్ బరొ, రిటూ బరొ కాపలాదరులుగా పని చేస్తున్నారు. చెరువులపై చేపలు తినేందుకు వచ్చే పిట్టలను వారు తుపాకీతో కాల్చి చంపుతుంటారు. ఈ క్రమంలో వారిద్దరూ తుపాకీలో వాడేందుకు గన్ పౌడర్ తయారు చేస్తుండగా.. మంగళవారం హఠాత్తుగా పేలింది.
Read Also: Ayodhya Ram Mandir: సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ కూడా!
ఈ ప్రమాదంలో ఇద్దరి ముఖాలపై తీవ్ర గాయాలయ్యాయి. రిటూ బరో(25) ఎడమ చేయి తునాతునకలు కావడం, తలపై బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు. బికాస్ బరొకు సైతం తలపై తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. గుడివాడ ప్రభుత్వాసుపత్రి వైద్యుల సిఫారసు మేరకు మెరుగైన వైద్యం కోసం అతడిని విజయవాడ తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం రిటూబరో మృతదేహం గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి వుందని సమాచారం. ముదినేపల్లి పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేశారు.