Off The Record: రన్ రాజా రన్… రేస్లో మనం వెనకబడకూడదు. సీటు కొట్టాలి… పట్టేంటో చూపాలి అంటూ ఆ ఇద్దరు నేతల్ని తెగ ప్రోత్సహిస్తున్నాయట గులాబీ వర్గాలు. పార్టీ ముఖ్య నేతలిద్దరికీ ఆ రెండు సీట్లు పరువు ప్రతిష్టల సమస్యగా మారిపోవడంతో… సర్వశక్తు ఒడ్డుతున్నారట అక్కడ. ఇద్దరూ రాష్ట్ర స్థాయి నేతలైనా… అక్కడే ఎందుకు కాన్సంట్రేట్ చేశారు? ఆ ఎంపీ సీట్లలోనే కాలికి బలపం కట్టుకుని తిరగడానికి కారణాలేంటి?
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరు మీదుంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు హోరా హోరీగా తలపడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఫలితాల విషయంలో ఎవరి లెక్కలు, అంచనాలు వారికున్నా… ప్రచారంలో మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా దూసుకుపోతున్నారు నేతలు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రాభవం కోల్పోతున్న బీఆర్ఎస్……తిరిగి పుంజుకునేందుకు నానా తంటాలు పడుతోంది. సీనియర్ నేతలను బరిలోకి దింపి గెలుపు అవకాశాల్ని మెరుగుపర్చుకునే పనిలో ఉంది గులాబీ దళం. ఇక 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న BRS నుంచి ఇప్పటికే ముగ్గురు హస్తం గూటికి చేరారు. ఇంకా వలసలు ఉంటాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో కేడర్కు భరోసా కల్పించే ప్రయత్నంలో ఉందట అధిష్టానం. ఈ క్రమంలోనే రెండు లోక్సభ సీట్లపై అందరి దృష్టి పడింది. పార్టీ అత్యంత ముఖ్య నేతలు ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ రెండు సీట్లను గ్యారంటీగా గెలిపించుకోగలిగితే… వలసల్ని కాస్తయినా తగ్గించడంతోపాటు టాప్టు బాటమ్ పార్టీలో జోష్ నింపవచ్చన్నది తెలంగాణ భవన్ వర్గాల ఆలోచనగా తెలిసింది. ఆ రెండిటిలో ఒకటి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న కరీంనగర్ లోక్సభ సీటు కాగా… మరొకటి హరీష్రావు ఎమ్మెల్యేగా ఉన్న సిద్దిపేట సెగ్మెంట్ ఉన్న మెదక్ లోక్సభ స్థానం. బావా బామ్మర్దులు ఇద్దరూ ఈ రెండు నియోజకవర్గాల బాధ్యతలు తీసుకోవడంతో ఇప్పుడు అందరి చూపు అటువైపే ఉంది.
ఒక రకంగా ఇది ఇద్దరికీ సవాల్ లాంటిదేనంటున్నారు పరిశీలకులు. కరీంనగర్ లోక్ సభ నుంచి పార్టీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. అక్కడ అభ్యర్థి గెలుపు కోసం కేటీఆర్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రచార సరళిని సమీక్షిస్తూ స్థానిక నేతలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పార్టీ ముఖ్యుడిగా, సిరిసిల్ల ఎమ్మెల్యేగా… కరీంనగర్ ఎంపీ సీటు తనకు అత్యంత ముఖ్యమని, అందుకే ఇక్కడ గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారట కేటీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న చోట… పార్లమెంటు సీటు గెలవలేకపోతే… క్యాడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భయం కూడా ఉందట. అందుకే… కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్కు అన్ని సీట్లు ముఖ్యమే అయినా… కరీంనగర్ మాత్రం కాస్త స్పెషల్ అంటున్నారు పరిశీలకులు. ఇటు పార్టీలో ట్రబుల్ షూటర్ గా చెప్పుకునే హరీష్రావు కూడా మెదక్ లోక్సభ సీటు విషయంలో పట్టుదలగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కచ్చితంగా మెదక్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని వ్యూహరచన చేస్తున్నారట ఆయన. ప్రత్యర్థి పార్టీల ఎన్నికల ప్రచారం…సొంత పార్టీ నేతల తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ… మార్పు చేర్పులు చేస్తున్నట్టు తెలిసింది. మొత్తంగా లోక్ సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ రెండు సీట్లను గెల్చుకుని సత్తా చాటాలనుకుంటున్నారట బావా బామ్మర్దులు. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలంటున్నారు పరిశీలకులు. రెండు సీట్లు గెలిచి భేష్ అనిపించుకుంటారా? లేక ఒక చోట విజయం సాధించి ఆ గెలిపించిన వారు అవతలి వాళ్ళ మీద నాదే పైచేయి అంటారా అన్నది కూడా ఉత్కంఠగా మారింది.