ఆ నియోజకవర్గానికి ఎవరైనా ఒక్కసారే ఎమ్మెల్యే. రెండోసారి మాత్రం వాళ్ళే దండం పెట్టేసి మరీ వెళ్ళిపోతున్నారట. రెండు ప్రధాన పార్టీలను ఒకే సామాజికవర్గం శాసిస్తోందని, ఎమ్మెల్యేని వాళ్ళే ఫిక్స్ చేస్తారన్నది ఇంటర్నల్ టాక్. వాళ్ళకి చెక్ పెట్టడానికి ఈసారి మరో సామాజికవర్గం పావులు కదుపుతోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏంటా కులాల కురుక్షేత్రం? తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికలప్పుడు అన్ని పార్టీల నుంచి కొత్త ముఖాలే కనిపిస్తుంటాయి. అది ఇది అని లేదు అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా… ఇక్కడ అభ్యర్థుల్ని మార్చడం మాత్రం ఆనవాయితీ అయిపోయింది. దాని ప్రకారమే ఈసారి కూడా కొత్త అభ్యర్థులు తెరమీదికి వచ్చారు. వైసీపీ తరపున తలారి వెంకట్రావు, టిడిపి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ పడుతున్నారు. ఇద్దరూ పాత ప్రత్యర్థులే అయినా కొవ్వూరు ఓటర్లకు మాత్రం కొత్తవారే. గతంలో గోపాలపురం నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా ఉన్నవారు ఇప్పుడు ఇక్కడ తలపడుతున్నారు.
పేరుకు ఇది ఎస్సీ రిజర్వుడు అయినా…. 26 వేల ఓట్లు ఉన్న కమ్మ సామాజిక వర్గానిదే డామినేషన్. ప్రచారం మొదలైనప్పటి నుంచి పోలింగ్ తేదీ ముందుదాకా అభ్యర్థులు హోరాహోరీగా పోరాడింది ఒక ఎత్తు. చివరి రెండు రోజులు మరో ఎత్తుగా ఉంటుంది ఇక్కడ. ఆ టైంలో రెండు పార్టీల్లో ఉన్న కమ్మ నాయకులు కలిసి మాట్లాడుకుని ఏ పార్టీ అభ్యర్థి తరపున ఎక్కువ సొమ్ములు పంచాలో డిసైడ్ చేస్తారట. అలా వాళ్ళు ఎక్కువ డబ్బు పంచిన అభ్యర్థే గెలవడం రివాజుగా మారిందన్నది లోకల్ టాక్. ఒక రకంగా ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని బహిరంగంగానే విమర్శిస్తున్న పరిస్థితి. పార్టీలతో సంబంధం లేకుండా లోకల్గా ఉండే ఒక సామాజికవర్గమే గెలుపు ఓటములను డిసైడ్ చేసే పరిస్థితి. అయితే ఈసారి ఆ పప్పులేం ఉడకవంటున్నారట కాపులు. ఫిక్సింగ్ గిక్సింగ్ జాన్తా నై ఎవరి సత్తా ఏంటో తేల్చుందామమని అంటున్నారట 40వేల ఓట్లకు పైగా ఉన్న కాపులు. గతంలో జరిగిన ఎన్నికల్లో మ్యాక్స్ ఫిక్సింగ్ జరగడం ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేని ఐదేళ్ల తర్వాత పక్కకు పంపేయడం రొటీన్ అయిపోయింది. గడిచిన నాలుగు దఫాలుగా ఇలాగే జరుగుతోంది. రెండు దశాబ్దాల నుంచి గెలిచిన వారంతా కొవ్వూరుకు వన్టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతున్నారు. ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత పార్టీ అయినా మారిపోతున్నారు లేక నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు.
టీవీ రామారావు, కె.ఎస్.జవహర్, తానేటి వనిత లాంటి వారంతా…. ఇలా కొవ్వూరుకు వన్టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయినవారే. అందుకు కారణం కమ్మ సామాజిక వర్గం నేతలతో సఖ్యత కుదరకపోవడమేనన్నది స్థానిక వర్గాల సమాచారం. ఇక్కడ టిడిపి, వైసిపి రెండుపార్టీల్లోనూ కమ్మ సామాజిక వర్గానిదే పై చేయి. ఎవర్ని గెలిపించాలో వాళ్ళే డిసైడ్ చేసి తాయిలాలు పంచుతుండటంతో…. గెలిచిన ఎమ్మెల్యే ఎవరైనా సరే… వాళ్ళ మాటకే కట్టుబడి ఉండాల్సి వస్తోందట. అలా మాట వినకుంటే మార్పు ఖాయమంటున్నారు స్థానికులు. ఎమ్మెల్యే గెలిచాక ఆ నేతల డామినేషన్ని వ్యతిరేకించడం వల్లే తరచూ మార్పు జరుగుతోందంటున్నారు పరిశీలకులు. గడిచిన నాలుగు విడతలుగా ఇదే జరుగుతోందంటున్నారు. అయితే ఈసారి మాత్రం ఫిక్సింగ్లు గట్రా ఏమీ లేకుండా గెలుపు ఓటములను అభ్యర్థుల బలా బలాలకే వదిలి పెట్టాలని టిడిపి వైసిపిల్లోని కాపు నేతలు పట్టుబడుతున్నారట. మా మాట కాదని ఒకవేళ ఫిక్సింగ్ జరిగితే… వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా సిద్ధమని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ప్రస్తుతం కొవ్వూరులో పోరు హోరా హోరీగా జరుగుతోంది. అయితే చివరి రెండు రోజుల్లో చరిత్ర పునరావృతం అవుతుందా లేక కాపుల డిమాండ్ ప్రకారం వదిలేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి ఎన్నికల్లో గెలిచేది ఎవరైనా సరే…. వన్టైంగా మిగిలిపోతారా? మరో ఛాన్స్ ఉంటుందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.