ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలా….అలా…. కట్టు తప్పుతోందా? అధికారులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా? అసలు……. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలకే దిక్కు లేకుండా పోతోందా? మీ ఆఫీసర్స్కి కాస్త చెప్పండంటూ…. ఏకంగా పక్క రాష్ట్ర మంత్రి సీఎంకు లేఖ రాయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఏపీ సర్కార్లో అసలేం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా తొమ్మిది నెలలవుతోంది. ఈ కాలంలో రకరకాల వివాదాలు, అంతకు మించిన ట్విస్ట్లు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు తీరును గట్టిగానే తప్పుపడుతున్నారు. పైగా… ఆ అభిప్రాయాన్నేమీ లోలోపల దాచుకోకుండా… తన గత వైఖరికి భిన్నంగా… పబ్లిక్గానే ఎండగడుతున్నారు. మీరు మారకుంటే… నేనే మారుస్తా, కఠిన నిర్ణయాలు తీసుకుంటానని వార్నింగ్స్ ఇస్తున్నారాయన. మొన్న మార్కాపురం టూర్లో స్థానిక ఎమ్మెల్యే మీద సీరియస్ అయ్యారు సీఎం. అలాగే ఒక వివాదంలో మరో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ వైఖరే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి అలా ఎందుకు మాట్లాడుతున్నారు? గతానికి భిన్నంగా పబ్లిక్గా వార్నింగ్స్ ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వంలో అసలేం జరుగుతోందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ క్రమంలోనే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారశైలి చర్చకు వస్తోందట. వాళ్ళ అత్యుత్సాహం, అవినీతి మరకలు, ఇసుక….లిక్కర్ మాఫియాలతో అంటకాగుతున్నట్టు గుర్తింపు…. ఇలా ప్రతి ఒక్కటీ సీఎం నోటీస్కు వస్తోందట. కాస్త డౌట్ ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే… అనుమానాస్పద, వివాదాస్పద ఎమ్మెల్యేల ప్రతి కదలిక సీఎంకు చేరుతోందట. అందుకే ఆయన అంత గట్టిగా, పబ్లిక్గా మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నట్టు సీఎంవో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదంతా చూస్తున్న రాజకీయ వర్గాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయట. సాధారణంగా ఏదైనా ఒక సందర్భంలో మాత్రమే, అదికూడా బాగా తప్పు చేస్తేనే ఎమ్మెల్యేలను హెచ్చరించడం చంద్రబాబు నైజం అంటారు. కానీ ఇప్పుడు ఏ మాత్రం అవకాశం దొరికినా మారాలి… ఎమ్మెల్యేలు మారాలి…. మారకపోతే కష్టం. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం అని ఆయన పదేపదే చెప్పడంపై గట్టి చర్చే జరుగుతోంది. ఎమ్మెల్యే సంగతి అలా ఉంటే… అటు కొంతమంది అధికారులు తీరు కూడా ముఖ్యమంత్రికి, మొత్తంగా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలి. కానీ… ఆ పరిస్థితి కనిపించట్లేదని సాక్షాత్తు టీడీపీ సభ్యులే అధికారుల మీద సీరియస్ అవుతున్న పరిస్థితి. ఇక కొంతమంది అధికారులైతే సీఎం మాటల్ని కూడా లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రకరకాల మీటింగ్స్లో స్వయంగా ఆయనే చెబుతున్నా…పనిపై దృష్టి పెట్టడం లేదన్న అభిప్రాయం పెరుగుతోంది. ఇదే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోందట. తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల్ని కూడా పరిగణనలోకి తీసుకోమని అధికారుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి.
అయినా… ఆ విషయంలో పెద్దగా స్పందన లేదట. ఆఫీసర్స్ పట్టీ పట్టనట్టుగా ఉంటున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ అయితే… ఓ అడుగు ముందుకేసి డైరెక్ట్గా చంద్రబాబుకే లేఖ రాశారు. మీ మాట అధికారులు వినడం లేదు… కాస్త గట్టిగా చెప్పండన్నది ఆ లేఖ సారాంశం కావడంతో… ఏపీ అధికారుల వైఖరి మీద విపరీతంగా చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. అంటే…. రాష్ట్రంలో స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలకే దిక్కులేకుండా పోయిందా అని మాట్లాడుకుంటున్నారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అధికారులు తీరు మార్చుకోవాలని అప్పుడప్పుడూ అంటూనే ఉన్నారు. అయినా సరే…. ఎలక తోలు తెచ్చి ఎందాక ఉతికినా అన్నట్టుగానే ఉంటోందట వ్యవహారం. మెల్లిగా ఇలాంటివన్నీ కలగలిసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయన్న అభిప్రాయం పెరుగుతోంది టీడీపీ వర్గాల్లో. అసలు…. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే ఈ రకమైన పరిస్థితి ఉంటే…. భవిష్యత్తులో ఎలా ముందుకెళ్తారన్నది పొలిటికల్ పండిట్స్ క్వశ్చన్. ఎమ్మెల్యేలు, అధికారులు ఇప్పుడే ఇంత ముదిరిపోతే… ముందు ముందు అసలు మాట వింటారా? సామాన్య జనానికి న్యాయం జరుగుతుందా? అన్న ప్రశ్నలకు తెలుగుదేశం వర్గాలే తెల్ల ముఖం వేసి చూడాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడెందుకు పరిస్థితి ఇంత దారుణందా తయారైందన్న విషయంలో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలన్న అభిప్రాయం ఇటు ప్రభుత్వ, అటు పార్టీ వర్గాల్లో పెరుగుతోంది. ఇలాగే చూసీ చూడనట్టు వదిలేస్తే… పుట్టి మునగడం ఖాయమన్నవార్నింగ్స్ సైతం వస్తున్నాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మీద కాస్త ఎక్కువ అభిమానం ఉన్న తమ్ముళ్లు అయితే… ఓ అడుగు ముందుకేసి నేరుగా సీఎంనే తప్పుబడుతున్నారట. అన్ని నివేదికలు ఆయన దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నట్టు? తప్పు చేసినవారి తాట తీస్తేనే కదా… భయం ఉండేది, ఏ భయం లేకపోతే ఇలాగే ఏడుస్తుందంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారట. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.