అది స్వపక్షమైనా, విపక్షమైనా…. ప్రత్యర్థులన్నవాళ్ళు లేకుండా చేసుకోవడమే ఆ ఎమ్మెల్యే లక్ష్యమా? విపక్ష శిబిరంలో ఉన్న కాస్తో కూస్తో పవర్ని లాగేసే కార్యక్రమం పూర్తయ్యాక… ఇప్పుడు టీడీపీలోని ప్రత్యర్ధులపై దృష్టి పెట్టారా? వాళ్ళని తరిమేయండని మినీ మహానాడు సాక్షిగా కేడర్కు పిలుపునివ్వడాన్ని ఎలా చూడాలి? ఎవరా ఎమ్మెల్యే? ఎందుకు ఆ స్థాయిలో ఫైర్ మీదున్నారు? రెండు దశాబ్దాలుగా కడప అసెంబ్లీ సీటులో సైకిల్ పార్టీకి గెలుపన్నదే లేదు. నియోజకవర్గంలో టీడీపీ ఉనికే ప్రమాదంలో పడిన సమయంలో 2024 ఎన్నికల్లో ఇక్కడ ఘన విజయంతో కడప టీడీపీకి కొత్త ఊపు వచ్చినట్టయింది. పార్టీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు మాధవి. అయితే… ఎన్నికల సమయంలోనే పార్టీ సీనియర్ నేత అలంకాన్పల్లె లక్ష్మిరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి మధ్య టికెట్ విషయంలో విభేదాలు తలెత్తాయి. లక్ష్మిరెడ్డి తన కోడలు ఉమాదేవికి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. జిల్లాలోని సగం మంది నాయకులు మద్దతు తెలిపారు. అటు తన భార్య మాధవికి టికెట్ కోసం పట్టుబట్టి సాధించుకున్నారు శ్రీనివాసులురెడ్డి. ఫైనల్గా ఎన్నికల్లో అంతా పార్టీ కోసం పని చేశారు. తర్వాత కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవి, లక్ష్మిరెడ్డి కోడలు ఉమాదేవి మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకే పార్టీలో ఉన్నా… ఇద్దరూ ప్రత్యర్థులుగానే మెలుగుతున్నారన్నది కడప టీడీపీ టాక్. ఇప్పుడిక మహానాడు జరుగుతున్న వేళ మరోసారి రెండు కుటుంబాల మద్య విభేదాలు రచ్చకెక్కాయి. నియోజకవర్గంలో తనకు అడ్డే లేకుండా చేసేందుకు పావులు కదుపుతున్నారట ఎమ్మెల్యే మాధవి. నాడు తన ఎమ్మెల్యే టికెట్కి అడ్డుతగిలిన లక్ష్మిరెడ్డి టార్గెట్గా మినీ మహానాడు వేదిక మీది నుంచి విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే. అలాంటి వాళ్ళు పార్టీ కండువా కప్పుకుని వస్తే… తరిమికొట్టండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీకి ఓటు వేయాలంటూ లక్ష్మిరెడ్డి మాట్లాడిన ఆడియో విడుదల చేశారు మాధవిరెడ్డి. నాడు తనను ఓడించేందుకే లక్ష్మిరెడ్డి, ఆయన కోడలు ఉమాదేవి వైసిపితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు ఎమ్మెల్యే. ఇలాంటి కోవర్టులను పార్టీ నుండి తరిమికొట్టాలని మినీ మహానాడు వేదికపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కడప టిడిపిలో దూమారం రేపుతున్నాయి.
అటు ఎమ్మెల్యే దంపతులపై లక్ష్మిరెడ్డి సైతం అదే స్థాయి లో ద్వజమెత్తారు. ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్నామని, పార్టీ కష్టకాలంలో కూడా వదిలి వెళ్ళలేదని క్లారిటీ ఇచ్చేశారాయన. వాసు కుటుంబం 2014 ఎన్నికల ముందు టిడిపిలో చేరి కడపలో మకాం వేసి పదవులు పొందారని అన్న లక్ష్మి రెడ్డి.. సీనియర్ నేతనైన నాకు మినీ మహానాడుకు ఎందుకు ఆహ్వానం పంపలేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే మాధవి అసలైన టిడిపి నాయకులను పక్కన పెట్టి వైసిపి నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తొలిసారి జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్న వేళ… ఇద్దరి మధ్య మొదలైన వివాదం… కార్యకర్తల్లో అయోమయాన్ని పెంచుతోందట. కానీ… దాంతో సంబంధం లేకుండా….ఎమ్మెల్యే మాధవి మాత్రం పార్టీలో ప్రత్యర్థులు లేకుండా చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తాను గెలిచిన రోజు నుంచే కడప నియోజకవర్గంలో వైసీపీని ఖాళీ చేసే పని మొదలుపెట్టారట ఎమ్మెల్యే. మేయర్ సురేష్ బాబును లక్ష్యంగా చేసుకుని ఆయనపై అనర్హత వేటుపడేలా చక్రం తిప్పి రాజకీయంగా ముందుకెళ్ళారు. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యాక….సొంత పార్టీలో అడ్డుగా ఉన్న సీనియర్ నేత లక్ష్మి రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసినట్టు అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. భవిష్యత్తులోఎప్పటికైనా మా కుటుంబం నుంచి పోటీ తప్పదనే కారణంతో ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లక్ష్మిరెడ్డి కూడా ఫైరైపోతున్న సమయంలో కడప రాజకీయం ఆసక్తికరంగా మారింది. మహానాడు జరుగుతున్న వేళ ఈ ఆధిపత్య పోరుపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.