Off The Record: రాజకీయంగా, వ్యక్తిగత జీవితంలోనూ.. ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన నాయకుడు రఘువీరారెడ్డి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేస్లో ఉన్న లీడర్. అలాంటి వ్యక్తి రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా పనిచేసి 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైరాగ్యంలోకి వెళ్లిపోయారు. నాడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరుగుతూ.. ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్టు బిజీగా ఉన్న నాయకుడు చివరికి సొంతూర్లో టీవీఎస్ మోపెడ్ మీద తిరుగుతూ, వ్యవసాయం చేసుకుంటూ గడిపేశారు. ఊళ్ళో గుడి, కంటి ఆసుపత్రి నిర్మాణం లాంటి కార్యక్రమాలతో అక్కడే ఉన్న రఘువీరా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఖద్దరు తొడిగారు. తిరిగి పవర్ పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ ప్రచారం చేయడంతో పాటు వ్యూహరచనలో కూడా పాలు పంచుకున్నారన్నది పార్టీ వర్గాల టాక్. రఘువీరా బాధ్యతలు తీసుకున్న నియోజకవర్గాల్లో పార్టీకి 98 శాతం పాజిటివ్ రిజల్ట్ వచ్చిందట. ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ అయినా.. తిరిగి అటువైపే చూస్తున్నట్టు తెలిసింది.
ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టాక.. అనుభవానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. చాలామంది సీనియర్స్, అలాగే యాక్టివ్గా ఉన్న వారిని తన టీమ్లో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే రఘువీరారెడ్డికి కూడా అత్యంత కీలకమైన వర్కింగ్ కమిటీ మెంబర్గా స్థానం కల్పించారు. సీడబ్ల్యూసీ మెంబర్ హోదాలో పార్టీ తరపున జాతీయ రాజకీయాల్లో కూడా రఘువీరా యాక్టివ్ కాబోతున్నట్టు ఈ పదవి ద్వారా స్పష్టమైందంటున్నారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడానికి చాలా ఏళ్ళే పడుతుందని గ్రహించిన రఘువీరా.. అటు జాతీయ పదవితోపాటు ఇటు కర్ణాటక రాజకీయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కన్నడ పొలిటికల్ సర్కిల్స్లో అయితే ఈ టాక్ ఓ రేంజ్లో ఉంది.
తన సొంత నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలతో పాటు.. బెంగళూర్లోని కొన్ని ఏరియాల్లో దాదాపు 50 శాతం తెలుగువారు ఉన్నారు. వీరితో పాటు మరికొన్ని ఏరియాల్లో ఆయన్ని కాంగ్రెస్ లీడర్గా గుర్తిస్తున్న కన్నడిగులు ఉన్నారు. దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుకూలమైన ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారట పీసీసీ మాచీ ఛీఫ్. కన్నడ సోషల్ మీడియాలో సైతం దీనికి సంబంధించిన పోస్ట్లు చక్కర్లు కొడుతున్నాయి. పక్క రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లే విషయమై ఆయన ఎక్కడా నోరు తెరవకున్నా… ప్రచారం మాత్రం ఆగడం లేదు. సీడబ్ల్యూసీ పదవి ఎలాగూ ఉంది కాబట్టి… నేషనల్ లుక్తో కర్ణాటక పాలిటిక్స్లోకి ప్రవేశిస్తారన్న ప్రచారానికి రఘువీరానే సమాధానం చెప్పాల్సి ఉంది.