Off The Record: తెలంగాణ రాజకీయం కూడా సమ్మర్ సెగల్లాగే మెల్లిగా హీటెక్కుతోంది. ఓ వైపు ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పీక్స్లో ఉంది. కానీ.. ఆ ఎలక్షన్స్కు దూరంగా ఉన్న బీఆర్ఎస్ పెద్దలు ఇస్తున్న ఉప ఎన్నికల స్టేట్మెంట్స్ మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అది కూడా వాళ్ళు వీళ్ళు కాకుండా… స్వయంగా కేసీఆర్ నోటి నుంచే బైపోల్ వ్యాఖ్యలు రావడంతో…. కళ్ళన్నీ ఒక్కసారిగా అటువైపు టర్న్ అయ్యాయి. కేసీఆర్ చెప్పినట్టు నిజంగానే… పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరుగుతాయా? లేక కేడర్లో జోష్ నింపడానికి ఆయన ఆ మాటలు అన్నారా? అన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్లో. అదే సమయంలో…అటువైపు నుంచి ఆలూ చూలూ లేని చోట బీఆర్ఎస్ ఏదేదో ఊహించేసుకుంటోందన్న సెటైర్స్ సైతం వినిపిస్తున్నాయి.
చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు… తాజాగా తెలంగాణ భవన్లో విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆ టైంలో… ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ సబ్జెక్ట్ అయ్యాయి. ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, అందుకు సిద్ధంగా ఉండాలంటూ నాయకులు, కార్యకర్తలకు సూచించారు కేసీఆర్. కేవలం బైపోల్ అంటే బైపోల్కాదు… అందులో గెలుపు కూడా మనదేనంటూ జోష్ నింపే ప్రయత్నం చేశారాయన. అంతకు ముందు ఫామ్హౌస్లో తనని కలిసిన కొందరితో కూడా ఉప ఎన్నికల గురించే మాట్లాడారట. దీన్నిబట్టి గులాబీ అధిష్టానం ఉప ఎన్నికల్ని గట్టిగా కోరుకుంటోందని, ఆ పేరుతో పార్టీని రీ ఛార్జ్ మోడ్లోకి తీసుకువెళ్ళచ్చని అనుకుంటున్నట్టు ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలు పలు సందర్భాల్లో బీఆర్ఎస్కు ఊపిరి పోశాయి. నాడు రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కాస్త స్లో అవుతోందన్న సంకేతాలు రాగానే…. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసేవారు. అలా కోరి తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో ఎప్పుడూ గులాబీ పార్టీదే పై చేయిగా ఉండేది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్తో బీఆర్ఎస్ అధిష్టానం బైపోల్ పలవరింతలు మొదలుపెట్టిందా అని కూడా మాట్లాడుకుంటున్నారట కొందరు.
కానీ… అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదా అన్నది ఎక్కువ మంది క్వశ్చన్. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా పాత పరిస్థితులు ఉంటాయా? ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అన్న డౌట్స్ ఉన్నాయట. అందుకు కూడా బీఆర్ఎస్ పెద్దల దగ్గర ఆన్సర్ ఉందంటున్నారు. తమ పదేళ్ళ పాలనలో ఏం చేశామో…. ముందు ముందు ఎలా ఉండబోతున్నామో… ఆ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెప్పి సక్సెస్ అవగలిగితే.. ఆటోమేటిగ్గా అదే రాబోయే సాధారణ ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తుందన్నది గులాబీ అధిష్టానం ఆలోచనగా చెప్పుకుంటున్నారు. అందుకే ఏ క్షణంలో ఉప ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ…. ఎమ్మెల్యేలు పార్టీ మారిన పది సెగ్మెంట్స్లోని ముఖ్య నేతలకు అలర్ట్ వెళ్ళినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఉప ఎన్నికలు రావడం అంత తేలికా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయట. అయితే… గతంలో మహారాష్ట్ర లాంటి చోట జరిగిన కొన్ని ఉదంతాలను బేస్ చేసుకుని… కచ్చితంగా వస్తాయని గులాబీ నాయకత్వం నమ్ముతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిందని… దీన్ని సరైన రీతిలో వాడుకోగలిగితే చాలన్నది కారు పార్టీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. ఎప్పటికైనా తెలంగాణకు మేమే ఆల్టర్నేట్ అని చెప్పాలన్నది బీఆర్ఎస్ టార్గెట్ అట. అందుకే ఉప ఎన్నికల కోణంలో సాంస్కృతిక బృందాలను కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో సైతం ఆటపాట తోనే జనంలోకి చొచ్చుకుపోయాం కాబట్టి… మళ్లీ అదే ఫార్ములాని నమ్ముకోవాలని అనుకుంటున్నారట. ఇవాళ కాకుంటే రేపైనా… ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని నమ్ముతున్న గులాబీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకోకుండా సిద్ధమవుతున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? అసలు వాళ్ళు ఆశిస్తున్నట్టు బైపోల్స్ జరుగుతాయా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.